Tiger sightings in Telangana: దట్టమైన వృక్షాలు. ఆకాశాన్ని తాకే విధంగా కొండలు.. గలగల పారే సెలయేర్లు.. అందులో రకరకాల జంతువులు.. ఫలితంగా జీవావరణం అద్భుతంగా ఉండేది. ప్రకృతి సమతుల్యం గొప్పగా అనిపించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే అభివృద్ధి వల్ల చెట్లు నేల కూలిపోయాయి. కొండలు కరిగిపోయాయి. సెలయేర్లు కాలగర్భంలో కలిసిపోయాయి.
అడవిని నమ్ముకున్న జంతువులు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. ఉన్న జంతువులు జనావాసాలాలో పడి కన్నుమూస్తున్నాయి. పెద్దపులి నుంచి మొదలు పెడితే జింకల వరకు ఇదే పరిస్థితి. కొన్ని సందర్భాలలో ఉన్న అడవుల్లో కూడా పులులకు ఆహారం దొరకడం లేదు. ఆహార అన్వేషణలో భాగంగా పులులు ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వస్తున్నాయి. ఆ సమయంలో ఆహారం లభించక.. ఆవాసం దొరకక నరకం చూస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి, జనగామ జిల్లాలలో మహారాష్ట్రలోని పాండవ ఖరా టైగర్ రిజర్వ్ నుంచి ఒక పులి వచ్చింది. ఈ పులి ముందుగా ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించి యాదాద్రి, జనగామ జిల్లాలలో ప్రవేశించింది. యాదాద్రి జిల్లాలోని కొలనుపాక ప్రాంతం నుంచి లింగాల గణపురం మండలం కుందారం గ్రామం శివారులోకి వచ్చింది. అక్కడ ఓ రైతుకు సంబంధించిన లేక దూడను చంపి తినేసింది. ఈ విషయం అటవీశాఖ అధికారులకు తెలియడంతో వారు పులి పాదముద్రలను పరిశీలించారు. అంతేకాదు ప్రజలకు సూచనలు చేశారు. రాత్రిపూట ఒంటరిగా వెళ్లకూడదని హెచ్చరించారు.
వాస్తవానికి ఈ ప్రాంతాల్లో పులి కనిపించక దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయింది. గతంలో ఈ ప్రాంతాలలో అడవులు విస్తారంగా ఉండేవి. కానీ, క్రమక్రమంగా అడవులు తగ్గిపోవడంతో పులులు కనుమరుగైపోయాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పులులకు కూడా సరైన ఆవాసం, ఆహారం లభించకపోవడంతో జనావాసాల్లోకి వస్తున్నాయి. చివరికి ప్రాణాలు కోల్పోతున్నాయి. మహారాష్ట్ర నుంచి వచ్చిన పులి పరిస్థితి కూడా ఇలానే ఉంది. అది ఆహార అన్వేషణ కోసం.. మనుగడ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఉపయోగం ఉండడం లేదు.
