KCR: కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.. కెసిఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నా.. ప్రగతిభవన్ లో ఉన్నా.. ఆయన దృష్టి మొత్తం రాజకీయాలు చుట్టూ తిరుగుతుంది. ఆయన ఆలోచన మొత్తం అధికారాన్ని సాధించడం లేదా సుస్థిరం చేసుకోవడం అయిపోగానే సాగుతుంది. కెసిఆర్ గురించి తెలిసినవారు.. కెసిఆర్ గురించి ఎరుకైన వారు నిత్యం చెప్పే మాటలు ఇవే. కెసిఆర్ రాజకీయ దురంధరుడు. తెలంగాణ రాజకీయాలలో తలపండినవాడు. అనేక ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడినవాడు.. అన్నిటికంటే ముఖ్యంగా హేళన చేసిన వారి ముందు తల ఎగరేసి సవాల్ చేసినవాడు.. కొన్ని సందర్భాలలో ఆయన అంచనాలు తప్పవచ్చు. కానీ మెజారిటీ సందర్భాలలో ఆయన అంచనాలు ఏమాత్రం తప్పలేదు.
కెసిఆర్ ఇప్పుడు ఒక రకమైన సంధి దశను ఎదుర్కొంటున్నారు. బహుశా ఆయన రాజకీయ జీవితంలో ఏనాడు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొని ఉండకపోవచ్చు. అంతటి తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ.. బలంగా నిలబడ్డారు. స్థిరంగా అడుగులు వేశారు. ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా కార్యచరణ రూపొందించారు. అందువల్లే ఆయనను ఇప్పటికీ తెలంగాణ ప్రజలు నమ్ముతుంటారు. ఆయన మాటలను వింటారు.
కొద్ది రోజులుగా కేసీఆర్ కుటుంబంలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ముఖ్యంగా కన్న కూతురు కేసీఆర్ వ్యవహార శైలిని ప్రశ్నిస్తున్నారు. కెసిఆర్ నాయకత్వాన్ని ఎదిరించారు. కెసిఆర్ పరిపాలన కాలంలో జరిగిన లోపాలను ఎత్తిచూపుతున్నారు. సహజంగానే ప్రశ్నించే స్వభావాన్ని కెసిఆర్ తట్టుకోలేరు. అందువల్లే తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరిని కూడా పార్టీలో ఉంచుకోలేదు. చివరికి కన్న కూతురిని సైతం బయటికి పంపించారు కేసీఆర్. ఇటీవల కాలంలో కేసీఆర్ ను రేవంత్ కూడా విమర్శించని స్థాయిలో కవిత విమర్శిస్తోంది. ఏకంగా కేసీఆర్ ను ఉద్దేశించి మరమనిషి అని వ్యాఖ్యానించింది. మన మనిషి కాదని ఓపెన్ గానే చెప్పేసింది. కెసిఆర్ చుట్టూ పందికొక్కులు ఉన్నాయని.. తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నిజంగా కేసీఆర్ గురించి ఈ స్థాయిలో మాట్లాడటం.. అది కూడా కవిత మాట్లాడటం గులాబీ పార్టీ శ్రేణులకు ఏమాత్రం రుచించడం లేదు.
అటు కవిత చేస్తున్న విమర్శలు.. పార్టీకి ఎదురవుతున్న వరుస ఓటములు.. ఇవన్నీ కూడా కేసీఆర్ ను ఆలోచింపజేశాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందువల్లే ఆయన మునుపటి స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు. అందువల్లే ఇటీవల జరిగిన సమావేశంలో పార్టీకి సంబంధించిన రాష్ట్రస్థాయి కమిటీ మినహా.. మిగతా అన్నింటిని రద్దు చేశారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను కేటీఆర్ కు అప్పగించారు. అదే కాదు గోడమీద పిల్లి లాగా వ్యవహరిస్తున్న నాయకులను బయటకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. పార్టీలో ఉంటూ.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారందరిని వెళ్లిపోవాలని మొహమాటం లేకుండా చెప్పేశారు. అంతేకాదు సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్గా ఉంటూ.. ప్రజా క్షేత్రంలో అంతగా కనిపించని నాయకులకు ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని కెసిఆర్ స్పష్టం చేశారు. “ముఖం చూసి టికెట్లు ఇచ్చేది ఉండదు. ప్రజాక్షేత్రంలో ఎవరైతే మెరుగ్గా పనిచేస్తారో వారికి మాత్రమే టికెట్లు ఇస్తాం. సిఫారసులతో వచ్చినప్పటికీ కూడా అవకాశం ఉండదు. సోషల్ మీడియాలో హంగామా చేసే వారికి పార్టీ టికెట్లు ఇచ్చేది ఉండదని” కెసిఆర్ స్పష్టం చేశారు.
ఇటీవల మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆ వ్యవహారం కాస్త మీడియాలో విపరీతమైన చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఆ తరహ నాయకులు పార్టీలో ఉండడం కంటే వెళ్లిపోవడం మంచిదని కెసిఆర్ నేరుగానే చెప్పేశారు.. ఈ ప్రకారం ఆ తరహా నేతలకు తన పార్టీలో చోటు లేదని.. ఒకవేళ ఉన్నా.. అటువంటి వారికి టికెట్లు ఇచ్చేది లేదని కెసిఆర్ స్పష్టం చేశారు.. అయితే సోషల్ మీడియాలో హంగామా చేస్తున్న నేతల మీద కేసీఆర్ గట్టిగానే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.. ఎందుకంటే సోషల్ మీడియాలో హంగామా చేశారు నాయకులు ప్రజలకు దూరంగా ఉంటున్నారు. అటువంటి వారికి టికెట్లు ఇచ్చి ఓడిపోవడం కంటే.. ఇవ్వకపోవడమే ఉత్తమం అన్నట్టుగా కెసిఆర్ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్ కు దగ్గరగా ఉండే నాయకులు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారాన్ని కోరుకుంటారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా కామెంట్లు చేస్తూ ప్రచారంలో ఉంటారు. అయితే వారందరికీ చెక్ పెట్టే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.. ఒక రకంగా కెసిఆర్ మాట్లాడిన మాటలు గులాబీ పార్టీలో సర్జికల్ స్ట్రైక్ లాగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే.. పార్టీ మునుపటి వైభవాన్ని సాధించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.