Kaleshwaram project controversy: కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు కారణమవుతోంది. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత సీబీఐ విచారణకు సిద్ధమవడం, మరోవైపు గోష్ కమిషన్ నివేదికపై సుప్రీం కోర్టులో తీర్పు రానుండడం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ క్రమంలో కేసీఆర్ కాళేశ్వరంపై మౌనం వహించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య హై ఓల్టేజీ ఫైట్కు దారితీసింది.
ప్రాజెక్టు నేపథ్యం
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. అయితే ప్రారంభించిన మూడేళ్లకే మేడిగడ్డ, అన్నరం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలు బటయపడ్డాయి. దీంతో నిధుల దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు వచ్చాయి. 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలపై విచారణకు జుడీషియల్ కమిటీ ఏర్పాటుచేసింది. 2025 సెప్టెంబర్లో కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని కేంద్రాన్ని కోరింది.
సీఎం పర్యటన.. సీబీఐ ఎంట్రీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం పునర్నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత, మేడిగడ్డ, అన్నరం, సుందిళ్లలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని మరోమారు కోరారు. ఈ క్రమంలో సీబీఐ కూడా రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణ ప్రారంభించింది, మాజీ సీఎం కేసీఆర్ను విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. ఇది రాజకీయ చర్చలకు దారితీసింది.
గోష్ కమిషన్పై తీర్పు..
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం లోపాలపై నివేదిక సమర్పించింది, దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఏప్రిల్ 8, 2026 న తీర్పు రావాలని ప్రకటించారు, కానీ ఇప్పటికే హైకోర్టు స్టే ఇచ్చింది. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్రావు, మాజీ సీఎస్ ఎస్కే.జోషి పిటిషన్లు దాఖలు చేశారు. కమిషన్ రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసిందని వాదన వినిపించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 22న కోర్టు తీర్పు రానుంది. ఈ క్రమంలో తీర్పు ప్రతికూలంగా వస్తే ఏం చేయాలనే అంశంపై హరీశ్రావు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో చర్చించారు.
కేసీఆర్ మౌనం ఎందుకు?
కాళేశ్వరంపై మూడు పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇలాటి సమయంలో కేసీర్ ఇటీవల జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కాళేశ్వరంపై ఒక్కమాట మాట్లాడలేదు. తర్వాత కూడా ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది కేసీఆర్ వ్యూహంగా విశ్లేషకులు చూస్తున్నారు.
మొత్తంగా కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రజాధనం దుర్వినియోగాన్ని ప్రశ్నిస్తోంది. బీఆర్ఎస్ ఇదంతా కుట్ర అని కొట్టిపారేస్తోంది. సీబీఐ విచారణకు భయపడేది లేదని అంటుంది. ఇక బీజేపీ కాళేశ్వరాన్ని పెద్ద స్కాంగా పేర్కొంటుంది. కాంగ్రెస్ కేసీఆర్ను కాపాడుతోందని ఆరోపిస్తుంది. ఈ క్రమంలో కోర్టు తీర్పు కీలకంగా మారింది.