HomeతెలంగాణTSPSC Chairman: తప్పుకున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌.. రాజీనామా చేశారా.. చేయించారా!?

TSPSC Chairman: తప్పుకున్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌.. రాజీనామా చేశారా.. చేయించారా!?

TSPSC Chairman: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ కమిషన్‌ చైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేశారు. ఈమేరకు రాజీనామా లేఖను గవర్నర్‌ తమిళిసైకి పంపించారు. వెంటనే గరవ్నర్‌ ఆమోదించి సీఎస్‌కు పంపారు. సీఎం రేవంత్‌రెడ్డిని సోమవారం కలిసిన జనార్దన్‌రెడ్డి తర్వాత కాసేపటికే తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు జనార్దన్‌రెడ్డి రాజీనామాపై ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు, నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్నారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచారు.

ఎన్నికల వేళ.. ఇదీ కీలకం..
తెలంగాణ అసెంబీల ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా కాంగ్రెస్‌ ఎక్కువగా విమర్శించిన అంశం టీఎస్‌పీఎస్సీ. గ్రూప్‌-1 రద్దవడం, గ్రూప్‌-2 వాయిదా పడడం, గ్రూప్‌-3కి పరీక్ష డేటే రాకపోవడం లాంటి ఎన్నో విషయాలను ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌ను ఇరుకునే పెట్టింది కాంగ్రెస్‌. దీంతో పొరపాటు జరిగిందని, మళ్లీ అధికారంలోకి వస్తే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని సాక్ష్యాత్తు నాటి మంత్రి కేటీఆరే చెప్పడం సంచలనం రేపింది. ప్రక్షాళన చేయడమంటే దాని అర్థం అప్పటివరకు బోర్డు ఫెయిల్ అయిందని కేటీఆర్‌ ఒప్పుకున్నట్లే కదా అని కాంగ్రెస్‌ విమర్శల దాడి చేసింది. మరోవైపు తాము అధికారంలోకి వస్తే జాబ్‌ క్యాలెండర్‌ సహా నిరుద్యోగుల కోసం గ్రూప్‌ నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలోనే జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఐదు రోజుల్లోనే టీఎస్‌పీఎస్పీపై దృష్టిపెట్టింది. ఎన్నికల అస్త్రంగా మారిన టీఎస్‌పీఎస్సీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

సీఎంను కలిసి.. కాసేపటికే రాజీనామా..
టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా జనార్దన్‌రెడ్డి 2021, మేలో నియమితులయ్యారు. మూడేళ్లుగా ఈ పదవిలో ఉన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో వైఫల్యం జనార్దన్‌రెడ్డికి మచ్చగా మారాయి. అయితే గతంలోనే ఆయన పదవికి రాజీనామా చేయాలని భావించినా.. నాటి మంత్రి కేటీఆర్‌ ఒత్తిడితో పదవిలో కొనసాగారు. కానీ, ఎన్నికల వేళ.. కేటీఆరే విఫలమైనట్లు పరోక్షంగా అంగీకరించారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డితో సోమవారం సమావేశమయ్యారు. బోర్టుకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎం, జనార్దన్‌ రెడ్డి చర్చించినట్లు తెలిసింది. ఇంతలోనే చైర్మన్‌ పదవికి ఆయన రిజైన్ చేశారు.

గ్రూప్ పరీక్షల రీషెడ్యూల్‌?
గ్రూప్-I, II, III, IV రిక్రూట్‌మెంట్ పరీక్షల మొత్తం పరీక్ష షెడ్యూల్‌ను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు, నోటిఫికేషన్ల వివరాలతో తదుపరి సమీక్ష సమావేశానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి కార్యాలయం టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌కు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు జారీ చేసిన కాసేపటికే చైర్మన్‌గా ఉన్న జనార్దన్‌రెడ్డి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాల కారణంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలంగాణ నిరుద్యోగ యువతకు రేవంత్‌రెడ్డి తీసుకోనున్న రీషెడ్యూల్ నిర్ణయం ఉపశమనం కలిగిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular