Jagga Reddy : జగ్గారెడ్డి.. కాంగ్రెస్ పార్టీలో ఆయనో సంచలనం. నిత్యం ప్రెస్మీట్లు పెట్టి ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ చర్చలోకి వస్తుంటారు. అదే విధంగా వివాదాస్పద వ్యాఖ్యలకు కూడా ఆయన కేరాఫ్ అని కూడా తెలుసు. అలాగే.. ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇవ్వడంలో.. వారికి వార్నింగ్ ఇవ్వడంలోనూ ఏమాత్రం తగ్గరు. అలాంటి జగ్గారెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన స్పందించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
వాస్తవానికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ.. అంతకుముందు రేవంత్ రెడ్డితో ఆయనకు పెద్దగా సఖ్యత ఉండేది కాదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి.. ఆయనకు పీసీసీ చీఫ్ పదవి అప్పజెప్పినప్పటి నుంచే ఆయనను విమర్శిస్తూనే ఉండేవారు. అయితే కొన్ని సందర్భాల్లో అది బహిరంగంగానే తేటతెల్లమైంది. కొత్తగా వచ్చిన వారికి పీసీసీ పదవి ఇవ్వడంపైనా ఆయన అప్పట్లో విమర్శలు చేశారు. ఒకానొక సందర్భంలో రేవంత్ రెడ్డి కూడా ఆయనతో సమావేశమై మద్దతు కోరిన సందర్భాలు ఉన్నాయి.
అయితే.. ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయింది. ఏకంగా రేవంత్ రెడ్డికి మద్దతుగా వ్యాఖ్యలు చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో గత నాలుగు రోజులుగా అరికెపూడి గాంధీ, కౌశిక్ వివాదం నడుస్తోంది. ఈ వివాదం ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు రేపింది. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన కేటీఆర్ నిన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన వచ్చి రాగానే కౌశిక్ రెడ్డిని పరామర్శించి అక్కడే మీడియాతో మాట్లాడారు.
కౌశిక్ రెడ్డిపై దాడి వెనుకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందన్నారు. ఇదంతా సీఎం కుట్ర అంటూ మాట్లాడారు. హైదరాబాద్లో కాంగ్రెస్కు ఒక్క సీటు రాలేదనే అక్కసుతోనే హైదరాబాద్ బ్రాండ్ ఈమేజీని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. అయితే.. కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి స్పందించారు. కేటీఆర్కు ఆయన స్టైల్లో మాస్ వార్నింగ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి జోలికొస్తే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు. గాంధీ కౌశిక్ రెడ్డిల వివాదం బీఆర్ఎస్ పార్టీకి చెందినదని.. ఈ విషయంతో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. రేవంత్ ను విమర్శిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని అన్నారు. అధికారం కోల్పోయి కేటీఆర్ ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలపై నోటీకి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పదేళ్లు అధికారంలో కొనసాగి.. ఇప్పుడు మరోసారి ప్రాంతీయతను రెచ్చగొడుతున్నారని అన్నారు. అయితే.. జగ్గారెడ్డి వ్యాఖ్యలపై పలు ట్రోల్స్ నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు ఒకలా వ్యవహరించి.. సీఎం కాగానే తీపి అయ్యాడా అనే కోణంలో విమర్శలు వినిపిస్తున్నాయి.
Chai Muchhata is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read More