Telangana Jobs: తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని పీసీసీ చీఫ్గా రేవంత్రెడ్డి గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. పదేళ్లలో ఉద్యోగాల భర్తీలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసిందని, ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా సక్రమంగా పరీక్షలు నిర్వహించలేకపోయిందని, ప్రశ్నపత్రాల లీకేజీతో అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో అన్నివర్గాల మద్దతులో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2023, డిసెంబర్ 7న రేవంత్రెడ్డి సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మరో మూడు నెలల్లో ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది. ఇప్పటి వరకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించిన గురుకుల పోస్టులు, నర్సింగ్ పోస్టులు, పోలీస్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి పోస్టింగ్ ఇచ్చింది. దాదాపుగా 50 వేల మందికి నియామక ఉత్తర్వులు జారీ చేసింది. 11 ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫకేషన్ ఇచ్చిన ప్రభుత్వం జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్ష నిర్వహించింది. కానీ ఫలితాలు ప్రకటించలేదు. తాజాగా స్టాఫ్నర్స్, ఫార్మసిస్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కాంగ్రెస్ హామీ నెరవేరాలంటే రెండు నెలల్లో లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయాలి. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్రెడ్డి త్వరలో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో 50 లక్షలకుపైగా నిరుద్యోగులు..
హైదరాబాద్లోని బీఎఫ్ఎస్ఐ స్కిల్ ట్రైనింగ్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్రెడ్డి హాజరై మాట్లాడారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే నిరుద్యోగ సమస్యను గుర్తించామని, అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. నిరుద్యోగ తీవ్రతను గుర్తించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 50 నుంచి 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని తెలిపారు. వెబ్సైట్లో 30 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. అందుకే ఉద్యోగాల భర్తీని బాధ్యతగా చేపడుతున్నామని పేర్కొన్నారు.
గత సర్కార్ నిర్లక్ష్యంతోనే..
గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెరిగిందని సీఎం తెలిపారు. తాము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదన్నారు. అందుకే ప్రైవేటు సెక్టార్లలో కూడా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టామన్నారు. అందుకే ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని పేర్కొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు.
ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలు
ఇక రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్ ఉండడం లేదని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఉద్యోగాలు పొందలేకపోతున్నారని తెలిపారు. అందుకే సరైన ప్రమాణాలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More