Rain Alert: మొన్నటిదాకా ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురువలేదు. అందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ప్రాజెక్టులు నీళ్లు లేక వెలవెలబోతున్నాయి. రైతులు పంటలు కూడా సరిగా సాగు చేయలేదు. వ్యవసాయ భూములు ఖాళీగా కనిపిస్తున్నాయి. నగరాలలో తాగునీటి కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణం లో మార్పులు చోటుచేసుకున్నాయి. రైతుల కరువు తీర్చేలా.. వర్షాలు కురవడం మొదలైంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో కొద్దిరోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహ ప్రాంతాలలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. ప్రాజెక్టులకు వరద వస్తోంది. మరికొద్ది రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షాలు విపరీతంగా కురుస్తున్న నేపథ్యంలో.. ఆ ప్రభావం ప్రజా రవాణా మీద పడుతోంది. కరెంటు తెలుగు రాష్ట్రాలలో అనేక జిల్లాలలో ఘర్షణ మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాఠశాలలకు వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో బుధవారం కొన్ని ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవిచ్చాయి. గురువారం కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పాఠశాలలకు సెలవు ఇస్తే బాగుంటుందని తల్లిదండ్రులు భావిస్తున్నారు.
వాతావరణ శాఖ చెప్పిన నివేదిక ప్రకారం ఆదిలాబాద్.. ఆసిఫాబాద్.. మంచిర్యాల.. నిర్మల్.. నిజామాబాద్.. జగిత్యాల.. కరీంనగర్.. పెద్దపల్లి.. భూపాలపల్లి.. ములుగు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది . భద్రాద్రి కొత్తగూడెం.. సంగారెడ్డి.. వికారాబాద్.. కామారెడ్డి.. మెదక్ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ చేసింది.
భారీ వర్షాలు కురిసే ప్రాంతాలలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఎందుకంటే వరద నీరు ఒకేసారి ముంచేస్తే ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ప్రమాదాలు జరగడాని కంటే ముందే అప్రమత్తంగా ఉండడం ఉత్తమం. అందువల్లే విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అయితే దీనిపై విద్యాశాఖ ఇంతవరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. అక్కడ వారికి మెరుగైన వసతి కల్పిస్తున్నారు.