Jeevan Reddy resigns Congress: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆసక్తికర పరిణామం ఒకటే జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి( Jeevan Reddy) నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. త్వరలో ఆయన కెసిఆర్ నేతృత్వంలోని బిఆర్ఎస్ లో చేరనున్నారు.. వాస్తవానికి ఇప్పుడు గులాబీ పార్టీ కష్టాల్లో ఉంది. పడి లేచేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఇటువంటి సమయంలో ఆ పార్టీలో జీవన్ రెడ్డి చేరడం మాత్రం సాహసమే. ఎందుకంటే కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి వెళ్లేందుకు ఎవరు ఇష్టపడరు. అక్కడ ఆప్షన్ గా భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ జీవన్ రెడ్డి మాత్రం గులాబీ పార్టీని ఎంచుకున్నారు. అయితే ఈ ఎంపిక వెనుక సైతం ఒక అజ్ఞాత శక్తి పని చేసినట్లు ప్రచారంలో ఉంది. ఆయనే ఏపీ మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి.
జగన్ ప్రస్తావన..
జగిత్యాల ( jagityala )నియోజకవర్గం లో తనకు ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయని భావించి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. అయితే గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు గురించి తెలుసు. చివరి వరకు జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ఉంచేందుకు ప్రయత్నాలు జరిగాయి. అదే సమయంలో జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుందని కూడా టాక్ నడిచింది. ఈ పరిణామాల క్రమంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురైన పరిణామాలను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తీసుకొచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని తెలియగానే జగన్మోహన్ రెడ్డి తనకు ఫోన్ చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కానీ జీవన్ రెడ్డి విషయంలోనే జగన్ నేరుగా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన సూచనతోనే జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరుతున్నట్లు కొత్త ప్రచారం మొదలైంది.
కెసిఆర్ కోసమే అలా..
కెసిఆర్ తో జగన్మోహన్ రెడ్డికి ఉన్న స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. వారిద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబు. అందుకే వారు వేరువేరు రాష్ట్రాల్లో అధికారంలో ఉంటూ చంద్రబాబును ఎంత ఇబ్బంది పెట్టాలో అంతలా పెట్టారు. పరస్పరం రాజకీయ సహకారాన్ని కూడా అందించుకున్నారు. అయితే ముందుగా కేసిఆర్ తెలంగాణలో ఓడిపోయారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం చవిచూశారు. ఇద్దరి పరిస్థితి ఏమంత బాగాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో కనీసం తెలంగాణలోనైనా బిఆర్ఎస్ బలపడితే తనకు పూర్వం మాదిరిగా సహకరిస్తుందన్నది జగన్ ఆశ. అందుకే జీవన్ రెడ్డికి నేరుగా ఫోన్ చేసి గులాబీ పార్టీలో చేరాలని జగన్ సూచించినట్లు పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే మాత్రం జరుగుతోంది. కెసిఆర్ సైతం జగన్మోహన్ రెడ్డి ద్వారానే జీవన్ రెడ్డిని ఆకర్షించినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
