Volunteers Recruitment: తెలంగాణలో పంటల నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామానికి ఒక వలంటీర్ ను నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. 45 రోజులపాటు నిర్వహించే ఈ సర్వే కోసం సరైన విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు లోకి వెళ్తే..
యాసంగి సీజన్లో రైతులు పండించిన పంటల భూభాగాలవారీగా డిజిటల్ గా నమోదు చేయడానికి వలంటీర్ల అవసరం ఉంటుంది. మీరు నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులను కోరుతోంది. ఈ నియామకల్లో భాగంగా 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అయితే వీరిలో గ్రామ భూములపై అవగాహన ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొంది. గ్రామ పరిసరాలు, సర్వే నంబర్లు, భూభాగాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఈ సర్వే కోసం ఎంపికైన వలంటీర్లు రైతుల పొలాల వద్దకు వెళ్లి పంటకు సంబంధించిన ఫోటోలను తీయాల్సి ఉంటుంది. ఈ ఫోటోలను మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేయాలి. ఒక్కో ఫోటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. యాసంగి సీజన్ మొత్తం 45 రోజుల పాటు ఈ ఫోటోలు అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కో వలంటీర్ 2000 ఫోటోలు అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 45 రోజుల్లో రూ.14,000 వరకు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది.
దీనిపై ఆసక్తి ఉన్నవారు విద్యార్హత సర్టిఫికెట్లు, ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత మండల వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అయితే స్థానిక అభ్యర్థులకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండడంతో గ్రామాల్లో ఉండేవారికి ఇది మంచి అవకాశం అని అంటున్నారు. పంటల నమోదు ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలు, ఇన్పుట్ సబ్సిడీలు, పంట బీమా వంటి ప్రయోజనాలు చేరే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ భావిస్తుంది. ఇందులో భాగంగా గ్రామస్థాయిలో డేటాను సేకరించి వాటి ద్వారా రైతులకు ప్రయోజనాలు చేకూర్చాలని చూస్తున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా 10,909 మందిని నియమించుకునేందుకు వ్యవసాయ శాఖ ప్లాన్ చేస్తుంది. అయితే వీటి కోసం ఎన్ని దరఖాస్తు వస్తాయో చూడాలి. దరఖాస్తులను పరిశీలించిన తర్వాత అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి కొన్ని రోజులపాటు శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత ఫీల్డ్ పైకి వెళ్లి వర్క్ చేయాల్సి ఉంటుంది.