
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. డిసెంబర్ 27 నుంచి వచ్చే నెల (జనవరి) 7వ తేదీ వరకు రైతులకు రైతుబంధు సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రైతు బంధు సహాయం పంపిణీకి సంబంధించి అధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. రైతుబంధు సహాయం పంపిణీకి అనుసరించాల్సిన విధానంపై చర్చించి.. కార్యాచరణను ఖరారు చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు మిగలకుండా అందరికీ సాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. రైతుల ఖాతాలోనే నేరుగా డబ్బులను జమ చేయాలని సూచించారు. దీనికోసం అవసరమైన రూ.7,300 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించారు. తక్కువ విస్తీర్ణం కలిగిన రైతుల నుంచి..ఎక్కువ విస్తీర్ణం కలిగిన రైతులందరికీ పది రోజుల వ్యవధిలో డబ్బులు జమ చేయాలని సీఎం చెప్పారు.