Homeప్రత్యేకంChatGPT: జీవితాలను తలకిందు చేస్తున్న చాట్‌ జీపీటీ

ChatGPT: జీవితాలను తలకిందు చేస్తున్న చాట్‌ జీపీటీ

ChatGPT: పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకంటే ఎక్కువ నష్టాలు జరుగుతున్నాయి. తాజాగా కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌) అందుబాటులోకి వచ్చిన తర్వాత జీవితాలు తలకిందులయ్యే పరిస్థితులు నెలకొంటున్నాయి. మానవ జీవితాన్ని సుఖమయం చేసుకునేందుకు, పనులను సులభతరం చేసుకునేందుకు అభివృద్ధి చేసిన ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌తో మానవ వినాశనం తప్పదని శాస్త్రవేత్తలే హెచ్చరిస్తున్నారు. ఇందుకు కోల్‌కతాకు చెందిన ఓ యువతి తాజా ఉదాహరణ.

ఏం జరిగింది..
కోల్‌కతాకుచెందిన శరణ్య భట్టాచార్య అనే 22 ఏళ్ల విద్యార్థిని తనకు వచ్చే నెలవారీ ఆదాయానికి దాదాపు 90 శాతం మేర కోతపడుతోందని సామాజిక మాధ్యమాల వేదికగా చెప్పుకొచ్చింది. కృత్రిమ మేధతో లాభాలతోపాటు నష్టాలు కూడా ఉన్నాయనడానికి ఈ ఘటనే ఉదాహరణ. డిగ్రీ పూర్తి చదువుతున్న శరణ్య స్థానికంగా క్రియేటివ్‌ సొల్యూషన్స్‌ ఏజెన్సీకి కాపీరైటర్‌గా ఫ్రీలాన్సింగ్‌ చేస్తోంది. తద్వారా వచ్చిన డబ్బులతో చదువు కొనసాగిస్తోంది. ఎస్‌ఈవోకి అనుగుణంగా కొన్ని కథనాలు రాసి నెలకు దాదాపు రూ.20 వేలు సంపాదించేది.

చాట్‌ జీపీటీతో..
చాట్‌జీపీటీ వినియోగంలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితం ఒక్కసారిగా కష్టాల్లోకి వెళ్లిపోయింది. వర్క్‌లోడ్‌ బాగా తగ్గిపోయింది. నెలకు 1 లేదా 2 కథనాలకు మాత్రమే ఆ ఏజెన్సీ అవకాశం కల్పిస్తోంది. ఎందుకు ఎక్కువ కథనాలు రాసేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని అడిగినా.. ఆ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం లేదు. తాను చేసే పనిని కృత్రిమ మేధతో చేయించుకుంటున్నారని అందుకే తనకు తక్కువ పనిని అప్పగిస్తున్నారని శరణ్య చెప్పుకొచ్చింది. తనకు వచ్చిన ఆదాయంతో ఇక్కడ చదువు కొనసాగించడమే కాకుండా ఇంటిదగ్గరున్న 45 ఏళ్ల తన తల్లికి కూడా చేదోడుగా నిలిచేదాన్నని, తన జీతంలో కోత ప్రభావం కుటుంబంపైనా పడిందని ఆవేదన వ్యక్తం చేసింది.

తల్లిని డబ్బులు అడగాల్సిన పరిస్థితి..
ఇన్నాళ్లు తన చదువులకు డబ్బులు తానే సంపాదించడంతోపాటు తల్లికి కూడా ఆర్థికంగా అండగా నిలిచిన శరణ్య ఇప్పుడు తల్లిని డబ్బులు అడగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లి చీరలు విక్రయిస్తారని పేర్కొంది. ఇంటి ఖర్చుల కోసం లెక్కలు వేసుకోవాల్సి వస్తోందని తెలిపింది. గతంలో ఎవరిపైనా ఆధారపడకుండా చదువు కొనసాగించానని, కృత్రిమ మేధ తన జీవితాన్ని కష్టాల్లోకి నెట్టిందని చెప్పుకొచ్చింది.

రెండు నెలలుగా దారుణ పరిస్థితి..
గత రెండు నెలలుగా పూర్తిగా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. యంత్రాలు చేసే పనికి, మనుషులు చేసే పనికి చాలా తేడా ఉంటుందని చెబుతూ.. ఉద్యోగులను దృష్టిలో ఉంచుకొని సంస్థలు నిర్ణయాలు తీసుకోవాలని అభ్యర్థించింది. లేదంటే చాలా మంది రోడ్డున పడాల్సి వస్తుందని హెచ్చరించింది.

భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కాపీ రైటర్లు కృత్రిమ మేధతో ప్రభావితమవుతున్నారు. ఒడిశాలోని ఓ టీవీ చానెల్‌ ఇప్పటికే న్యూస్‌ రీడర్‌గా ఏఐని ఉపయోగిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి కూడా ఏఐ త్వరలో రాబోతోందని అంటున్నారు. మరోవైపు ప్రేయసిగా, భార్యగా కూడా ఏఐ రోబోలు ఇళ్లలోకి కూడా వస్తాయని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. మరి నట్టింట్లోకి వచ్చే కృత్రిమ మేధ.. మన జీవితాలను ఇంకెంత దుర్భరంగా మారుస్తుందో చూడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular