Homeక్రీడలుక్రికెట్‌Washington Sundar : 11 వికెట్లు పడగొట్టాడు.. జట్టులో మాత్రం అవకాశం లేదు..ఇదయ్యా టాలెంట్ కు...

Washington Sundar : 11 వికెట్లు పడగొట్టాడు.. జట్టులో మాత్రం అవకాశం లేదు..ఇదయ్యా టాలెంట్ కు మీరిచ్చే గౌరవం?

Washington Sundar : న్యూజిలాండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా టీమిండియా పై సిరీస్ సాధించింది. ఇప్పటికే రెండు టెస్టులు గెలిచిన ఆ జట్టు.. మూడవ టెస్ట్ కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. 30 సంవత్సరాల తర్వాత టీమిండియా పై తొలి సిరీస్ విజయాన్ని న్యూజిలాండ్ అందుకుంది. ఈ క్రమంలో ముంబై వేదికగా జరిగే మూడవ టెస్ట్ కూడా హోరాహోరీగా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. తొలి, రెండు టెస్టులలో టీమిండియా ఆటగాళ్ల బృందం అనేక తప్పులు చేసింది. ఈ క్రమంలో దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు భారత మేనేజ్మెంట్ రెడీ అయింది. బెంగళూరులో పేస్, పూణేలో స్పిన్ బౌలింగ్ ను ఆడటంలో టీమిండియా ఆటగాళ్లు విఫలమయ్యారు. దీంతో మైదానం రూపొందించే విధానంలో గౌతమ్ గంభీర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది.. మూడవ టెస్టు కోసం అటు బ్యాటింగ్ , ఇటు బౌలింగ్ కు సహకరించే విధంగా మైదానాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. టర్నింగ్ ట్రాక్ కు మంగళం పాడినట్టు సమాచారం.

జట్టులో అవకాశం లేదట..

పూణే టెస్టులో వర్ధమాన ఆటగాడు వాషింగ్టన్ సుందర్ 11 వికెట్లు పడగొట్టాడు. ఒకరకంగా న్యూజిలాండ్ జట్టును ఇబ్బందుల్లో పెట్టాడు. అయితే అతడి తీరుగానే బ్యాటర్లు కూడా సత్తా చాటి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. అయితే ముంబై వేదికగా జరిగే మూడో టెస్టులో వాషింగ్టన్ సుందర్ కు జట్టులో అవకాశం దక్కకుండా పోతోందని తెలుస్తోంది. మూడో టెస్టులో అతడిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ముంబై మైదానాన్ని పేస్, స్పిన్ తో పాటు బ్యాటింగ్ కు కూడా అనుకూలంగా మార్చుతున్నారని తెలుస్తోంది దీంతో భారత జట్టు ఇద్దరు స్పిన్ బౌలర్లతో రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. సుందర్ కు ఉద్వాసన పలకడం ఖాయంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదయ్యా మీరు టాలెంట్ కు ఇచ్చే గౌరవం అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

వాషింగ్టన్ కు ఉద్వాసన

రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజ ప్రధాన స్పిన్నర్లుగా బరిలోకి దిగితే.. సుందర్ పై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. సుదీర్ఘ విరమణ తర్వాత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సుందర్.. ఏకంగా 11 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లు సొంతం చేసుకున్నాడు. రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టాడు. అత్యద్భుతమైన గణాంకాలను నమోదు చేశాడు. రెండవ టెస్టులు టీమిండియా ఓడిపోయినప్పటికీ సుందర్ ఆట తీరు అందరిని ఆకట్టుకుంది. అతడు 11 వికెట్లు పడగొట్టడంతో పూర్తిస్థాయి స్పిన్ బౌలర్ గా జట్టులో కొనసాగించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అంచనా వేశారు. కానీ వారి అంచనాలకు భిన్నంగా సుందర్ కు ముంబై టెస్టులో ఆడే అవకాశం లేకుండా పోయింది.. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ బౌలర్లుగా రంగంలోకి దిగుతున్న నేపథ్యంలో..ఎక్స్ ట్రా స్పిన్ బౌలర్ కు బదులుగా భారత జట్టు అదనపు పేస్ బౌలర్ తో రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. బుమ్రా, ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్ పేస్ బౌలింగ్ బాధ్యతలను పంచుకోనున్నారు. అశ్విన్, జడేజా స్పిన్ బౌలర్లుగా జట్టుకు సేవలు అందిస్తారు.

జట్టు అంచనా ఇలా

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, గిల్, రిషబ్ పంత్, రవిచంద్ర అశ్విన్, మహమ్మద్ సిరాజ్, బుమ్రా, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ దీప్..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular