MS Dhoni : ప్రపంచ క్రికెట్ లో మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ ఎటువంటిదో అందరికీ తెలిసిందే. ధోనీకి సంబంధించిన ఏ చిన్న వార్త అయినా అభిమానులు ఆసక్తిగా చూస్తుంటారు. గత కొన్నేళ్లుగా ధోని రిటైర్మెంట్ కు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ కూడా ఆడడన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో ధోని రిటైర్మెంట్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోని రిటైర్మెంట్ ప్రకటించినప్పటికే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడే మ్యాచ్ లకు వేలాదిమంది అభిమానులు తరలివస్తున్నారు. చెన్నై జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడిన.. ధోని అభిమానులతో స్టేడియాలు నిండిపోతున్నాయి. వేదిక ఏదైనా చెన్నై జట్టు మ్యాచ్ ఆడితే మాత్రం.. అది సీఎస్కే హోమ్ గ్రౌండ్ మాదిరిగానే కనిపిస్తోంది. ఆ స్థాయిలో చెన్నై జట్టు అభిమానులు మ్యాచ్ లు వీక్షించేందుకు తరలివస్తున్నారు అంటే అది ధోని వల్లే అని నిర్మొహమాటంగా చెప్పవచ్చు. అటువంటి ధోని వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ కూడా ఆడడు అన్న విషయం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. దీనికి సంబంధించి గత కొన్నాళ్ల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ధోని దీనిపై ఎక్కడా స్పందించలేదు. అయితే, చెన్నై జట్టు సీఈవో దీనిపై తాజాగా స్పందించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
కోల్ కతాతో మ్యాచ్ లో ఓటమిపాలైన చెన్నై జట్టు..
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆదివారం సాయంత్రం హోమ్ గ్రౌండ్ చెపాక్ స్టేడియంలో కోల్ కతా జట్టుతో మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో దారుణమైన ఆట తీరుతో చెన్నై జట్టు ఓటమిపాలైంది. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై ఆరు వికెట్లు నష్టపోయి 144 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ 13 బంతుల్లో 17 పరుగులు, కాన్వే 28 బంతుల్లో 30 పరుగులు, రహానే 11 బంతుల్లో 16 పరుగులు, శివం దూబే 34 బంతుల్లో 48 పరుగులు, రవీంద్ర జడేజా 24 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేయడంతో స్వల్ప స్కోర్ కే పరిమితమైంది చెన్నై జట్టు. కేకేఆర్ బౌలర్లలో చక్రవర్తి, నరేన్ రెండేసి వికెట్లు తీసుకోగా, తాకుర్, అభినవ్ అరోరా ఒక్కో వికెట్ తీసుకున్నారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు ఆదిలో తడబడింది. 4.3 ఓవర్లలో 33 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ నితీష్ రానా, రింకు సింగ్ ఆచితూచి ఆడి జట్టును విజయ పథాన నడిపించారు. నితీష్ రానా 44 బంతుల్లో 57 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా, రింకు సింగ్ 43 బంతుల్లో 54 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో చెన్నై జట్టుపై మరో తొమ్మిది బంతులు మిగిలి ఉండగానే కేకేఆర్ జట్టు విజయం సాధించింది.
చెపాక్ లో చివరి లీగ్ మ్యాచ్ కావడంతో..
చెపాక్ స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్ చివరి లీగ్ మ్యాచ్. దీంతో మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు మైదానమంతా కలియతిరిగారు. ఎన్నడూ లేని విధంగా మ్యాచ్ అనంతరం ప్లేయర్లు ఇలా తిరగడంతో ఇది ధోనీకి చివరి సీజన్ కావచ్చు అన్న సందేహం అభిమానుల్లో వ్యక్తం అయింది. సునీల్ గవాస్కర్ కూడా ధోని ఆటోగ్రాఫ్ తీసుకోవడంతో ఆ వాదనకు మరింత బలం చేకూరినట్టు అయింది. చెపాక్ స్టేడియంలో రెండు ప్లే ఆఫ్ మ్యాచులు ఉన్నప్పటికీ.. లీగ్ దశలో మాత్రం సిఎస్కేకు ఇదే చివరి మ్యాచ్. దీంతో ఆటగాళ్లు కూడా చెన్నై అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే అభిమానుల ఆందోళనకు కారణం అయింది. చివర్లో చెన్నై ప్రాంచైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక విషయాన్ని తెలియజేశాడు. ‘ వచ్చే సీజన్ లోను ధోని తప్పకుండా ఆడతాడు అనే నమ్మకం మాకుంది. అభిమానులు ఎల్లవేళలా ఇలానే మద్దతుగా నిలవాలని కోరుతున్న’ అని సీఈఓ వెల్లడించాడు. దీంతో అభిమానుల ఆందోళన కొంతవరకు తగ్గినట్టు అయింది.
పాయింట్లు పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతున్న చెన్నై..
ప్రస్తుతం చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. చివరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో వారి సొంత మైదానంలో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్ లో ఓడితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు ముంబై, లక్నో, బెంగుళూరుతో పోటీ పడాల్సి ఉంటుంది. తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ మే 23న, ఎలిమినేటర్ మ్యాచ్ మే 24న చెన్నైలో జరుగుతాయి. చెన్నై జట్టు టాప్-2 లో ఉంటే తొలి క్వాలిఫైయర్ ను చెన్నైలో ఆడే అవకాశం ఉంటుంది. మూడు లేదా నాలుగు స్థానంలో ఉంటే కూడా చెన్నైలోనే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. రెండో క్వాలిఫైయర్, ఫైనల్ మ్యాచ్ లు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: This is dhonis last ipl season
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com