PBKS Vs CSK: పాయింట్ల పట్టికలో మొన్నటి దాకా మూడో స్థానంలో ఉన్న చెన్నై జట్టు ప్రస్తుతం ఐదో స్థానానికి పడిపోయింది. ప్లే ఆఫ్ ముందు లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓటమిపాలై.. పరువు తీసుకుంది. ప్లే ఆఫ్ వెళ్లాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన పరిస్థితి చెన్నై జట్టుది. ఈ నేపథ్యంలో ఆదివారం ధర్మశాల వేదికగా పంజాబ్ జట్టుతో తలపడింది. భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నై జట్టు.. ముందుగా బ్యాటింగ్ చేసి ఓ మోస్తరు స్కోర్ మాత్రమే చేసింది.. కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ తలా మూడు వికెట్లు పడగొట్టారు. చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా 26 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడు గనుక నిలబడకపోయి ఉంటే.. చెన్నై స్కోర్ మరింత తక్కువ ఉండేది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. ఈ టోర్నీలో పెద్దగా రాణించలేకపోతున్న ఓపెనర్ అజింక్యా రహానే.. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ అదే పేలవమైన ఫామ్ కనబరిచాడు. కేవలం 9 పరుగులు చేసి అర్ష్ దీప్ బౌలింగ్ లో షాట్ ఆడగా.. రబాడా చేతికి చిక్కాడు. ఈ నేపథ్యంలో వచ్చిన మిచెల్ 30 పరుగులు చేశాడు. కెప్టెన్ గైక్వాడ్ (32) తో కలిసి చెన్నై జట్టు ఇన్నింగ్స్ భారాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పవర్ ప్లే లో చెన్నై జట్టు స్కోరు ను 60 పరుగులకు చేర్చారు. అయితే వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతున్న నేపథ్యంలో రాహుల్ చాహర్ రుతు రాజ్ గైక్వాడ్ ను అవుట్ చేశాడు. ఆ తర్వాత బంతికే శివం దూబే ను డక్ ఔట్ చేశాడు. వాస్తవానికి దూబే ఇలా అవుట్ కావడం ఇది రెండవసారి. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లోనూ అతడు అలాగే అవుట్ అయ్యాడు..మిచెల్ కూడా హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా చెన్నై జట్టు 75/4 తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో మెయిన్ అలీ 17, రవీంద్ర జడేజా ధాటిగా ఆడారు. అయితే పంజాబ్ బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడంతో.. చెన్నై బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయారు. చివర్లో శార్దూల్ ఠాకూర్ 11 బంతుల్లో 17 పరుగులు చేయడంతో చెన్నై జట్టు ఒక మోస్తరు స్కోర్ చేసింది.. చెన్నై ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ అవుతున్న నేపథ్యంలో.. ధోని తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. అతడిని హర్షల్ పటేల్ తొలి బంతికే క్లీన్ బౌల్డ్ చేసి గోల్డెన్ డక్ గా వెనక్కి పంపించాడు. వాస్తవానికి ఈ టోర్నీలో చెన్నై జట్టు తరఫున ధోని చివర్లో బ్యాటింగ్ కు వచ్చి.. అదరగొడుతున్నాడు. తక్కువ బంతుల్లో మెరుపు వేగంతో స్కోర్ చేస్తూ చెన్నై జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని ఇస్తున్నాడు. ధోని గోల్డెన్ డక్ గా అవుట్ అవ్వడం ఈ టోర్నీలో ఇదే మొదటిసారి. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ చెరో మూడు వికెట్లు తీశారు. అర్ష దీప్ రెండు వికెట్లు పడగొట్టాడు.
The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d
— JioCinema (@JioCinema) May 5, 2024