MS Dhoni And Ravindra Jadeja: ఐపీఎల్ లో కొందరి క్రికెటర్ల మధ్య అద్భుతమైన స్నేహం ఉంటుంది. వేర్వేరు జట్లలో ఆడుతున్నప్పటికీ.. వారి మధ్య స్నేహం ఏమాత్రం తగ్గలేదు. గ్రౌండ్ లో మాత్రమే క్రీడాస్పూర్తి ప్రదర్శించే ఆ ప్లేయర్లు.. మ్యాచ్ ముగిసిన తర్వాత దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ భుజాల మీద చేతులు వేసుకుంటూ సందడి చేస్తారు. ఈ జాబితాలో ధోని, రవీంద్ర జడేజా ముందు వరుసలో ఉంటారు.
ఐపీఎల్ లో చెన్నై జట్టు ఐదుసార్లు విజేతగా నిలవడం వెనక ధోని కృషి ఎంతైతే ఉందో.. రవీంద్ర జడేజా కష్టం కూడా అంతే ఉంది. అందువల్లే రవీంద్ర జడేజా అనేక సందర్భాలలో ధోనిని తన పెద్ద సోదరుడు అని పిలిచేవాడు. ముఖ్యంగా 2023లో చెన్నై జట్టు ఐపిఎల్ ట్రోఫీ అందుకోవడంలో రవీంద్ర జడేజా పోషించిన పాత్ర గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. చెన్నై జట్టు యాజమాన్యంతో ధోనికి ఎంతైతే బాండింగ్ ఉందో.. రవీంద్ర జడేజాకు కూడా అంతే స్థాయిలో బాండింగ్ ఉంది.
ఇటీవల జరిగిన మెగా వేలంలో సంజు శాంసన్ కోసం చెన్నై యాజమాన్యం రవీంద్ర జడేజాను రాజస్థాన్ కు పంపింది. ట్రేడ్ ఒప్పందంలో భాగంగా సంజును చెన్నై జట్టు తీసుకుంది. రాజస్థాన్ జట్టుకు వెళ్ళిన తర్వాత రవీంద్ర జడేజా విపరీతంగా ప్రాక్టీస్ చేశాడు. తన బౌలింగ్ నైపుణ్యానికి మరింత పదును పెట్టుకున్నాడు. ఆ ఎఫెక్ట్ చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ప్రస్ఫుటంగా కనిపించింది.
రవీంద్ర జడేజా 2.0 అన్నట్టుగా అతని బౌలింగ్ కనిపించింది. రెండు వికెట్లు తీయడం మాత్రమే కాకుండా.. గన్ ఫైర్ సెలబ్రేషన్స్ తో రవీంద్ర జడేజా ఆకట్టుకున్నాడు.. ఈ నేపథ్యంలో జడేజా మాట్లాడిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మీడియాలో విచిత్రంగా కనిపిస్తోంది.. చెన్నై జట్టు నుంచి రాజస్థాన్ కు వెళ్లిపోయిన తర్వాత ధోనితో మాట్లాడలేదని రవీంద్ర జడేజా స్పష్టం చేశాడు. ధోని ఫోన్ ఎప్పటికి స్విచ్ ఆఫ్ చేసి ఉంటుందని.. అందువల్లే మాట్లాడలేదని అతడు సరదాగా వ్యాఖ్యానించాడు.
ధోని చికిత్స తీసుకుంటున్న క్రమంలో.. సోమవారం జరిగిన మ్యాచ్లో కలిసే అవకాశం రాలేదని పేర్కొన్నాడు. అంతేకాదు ఈసారి కలిస్తే చాలాసేపు మాట్లాడుకుంటామని స్పష్టం చేశాడు. మరోవైపు నిన్న మ్యాచ్ ముగిసిన తర్వాత చెన్నై ఆటగాడు ఖలీల్ ధరించిన సీఎస్కే జెర్సీని జడేజా ముద్దు పెట్టుకున్నాడు. కొద్దిసేపు భావోద్వేగానికి గురయ్యాడు. చెన్నై జట్టుతో జడేజాకు సుదీర్ఘ సంబంధం ఉంది. ఈ ఏడాది అది తెగిపోయింది. ప్రస్తుతం అతడు రాజస్థాన్ జట్టుతో ప్రయాణం సాగిస్తున్నాడు. ఆ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.