IPL, T20 World cup : కరోనా మహమ్మారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై ఎంతటి ప్రభావం చూపిందో తెలిసిందే. బయోబబూల్ ను సైతం ఛేదించి ఐపీఎల్ ఆటగాళ్లను కరోనా టచ్ చేయడంతో.. అర్ధంతరంగా టోర్నీ ఆగిపోయింది. మళ్లీ మొదలవుతుందా? అనే అనుమానాల నడుమ.. దుబాయ్ తరలిపోయిందీ సీజన్. తొలి దశలో ఎక్కడి నుంచి మ్యాచ్ లు ఆగిపోయాయో.. అక్కడి నుంచి మిగిలిన మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఈ ధనాధన్ టోర్నీ సెకండ్ ఫేజ్ కు ఇంకా.. ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఆదివారం (సెప్టెంబర్ 19) నుంచి ఐపీఎల్ 2021 రెండో దశ మొదలు కానుంది. అయితే.. దుబాయ్ లో పిచ్ లు ఎలా ఉన్నాయి? అవి ఎవరికి అనుకూలం? అన్నది చూద్దాం.
నిజానికి గతేడాది కూడా కొవిడ్ విజృంభించడంతో.. 2020 సీజన్ దుబాయ్ లోనే నిర్వహించారు. పరిస్థితులు చక్కబడ్డాయని 2021 ఇండియాలోనిర్వహించారు. కాేనీ.. అనివార్యంగా సెకండ్ ఫేజ్ అక్కడికే వెళ్లిపోవాల్సి వచ్చింది. దుబాయ్ వేదికగా జరిగే ఐపీఎల్ మ్యాచులన్నీ షార్జా, అబుదాబి, దుబాయ్ స్టేడియాల్లోనే జరగనున్నాయి. ఐపీఎల్ లో మొత్తం 31 మ్యాచ్ లు ఇక్కడ జరుగుతాయి.
ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ కూడా అక్కడే జరగనుంది. ఒమన్ తో కలిపి దుబాయ్ లోనే నిర్వహించనున్నారు. నిజానికి ఈ సారి టీ20 ప్రపంచకప్ ను భారత్ నిర్వహించాల్సి ఉంది. కానీ.. కరోనా కారణంగా ఐపీఎల్ నే నిర్వహించలేకపోవడంతో.. టీ20 వరల్డ్ కప్ ను కూడా దుబాయ్ కే షిఫ్ట్ చేశారు. ఈ టోర్నీకి సంబంధించి దాదాపు 36 మ్యాచ్ లో జరగనున్నాయి. అంటే.. రెండు నెలల గ్యాప్ లోనే ఇక్కడ ఐపీఎల్, వరల్డ్ కప్ టోర్నీలకు సంబంధించి 65 మ్యాచ్ లు జరగాల్సి ఉంది.
మరి, ఇంత సుదీర్ఘ మ్యాచ్ లు కేవలం నాలుగు వేదికల్లోనే జరగనుండడంతో ఆ పిచ్ లు ఎలా ఉండనున్నాయి? ఎవరికి అనుకూలం కానున్నాయి? అనేది చర్చ మొదలైంది. వాస్తవానికి దుబాయ్ లోని పిచ్ లపై పచ్చిక ఉంటుంది. అందువల్ల సహజంగానే ఫాస్ట్ బౌలింగ్ కు అనుకూలిస్తాయి. అయితే.. ఐదారు మ్యాచ్ లు జరిగే టోర్నీల్లో అయితే.. పేస్ దళానిదే పైచేయిగా ఉంటుంది. కానీ.. ఇక్కడ జరగబోయేది రెండు భారీ టోర్నీలు. ఏకంగా 65 మ్యాచ్ లు నాలుగు పిచ్ ల మీదనే జరగనున్నాయి.
కాబట్టి.. అనివార్యంగా కొన్ని మ్యాచ్ లకే ఆ పిచ్ లు జీవం కోల్పోతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వేగంగా పిచ్ పై పచ్చిక పెంచడం సాధ్యం కాదుకాబట్టి.. కొన్ని మ్యాచ్ ల తర్వాత క్రమంగా స్పిన్ కు అనుకూలించడం మొదలు పెడతాయని అంటున్నారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ మొదలయ్యే నాటికి పూర్తిగా స్పిన్ బౌలింగ్ కు అనుకూలించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఈ స్టేడియాల్లో గత రికార్డు కూడా.. బౌలర్లదే ఆధిపత్యమని చాటుతోంది. మరి, రాబోయే రెండు టోర్నీల్లో ఎవరి హవా కొనసాగుతుందన్నది చూడాలి.