India Vs South Africa: ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వరుసగా విజయాలు సాధించింది. పాకిస్తాన్ పై మినహా.. మిగతా అన్ని మ్యాచ్లలో టీమిండియా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంది. తన స్థాయికి తగ్గట్టుగా పరుగులు చేయలేకపోయింది. భారీగా అంచనాలు పెట్టుకున్న ఆటగాళ్లు.. ఆశించిన స్థాయిలో ఆడ లేక పోయారు. ఫలితంగా అభిమానులు ఊహించినట్టుగా టీమిండియా 200 పరుగుల స్కోరు ఇంతవరకు చేయలేకపోయింది.
లీగ్ సమరం ముగిసిన నేపథ్యంలో టీమిండియా ఆదివారం నుంచి సూపర్ 8 పోరును మొదలు పెడుతోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా జట్టుతో అహ్మదాబాద్ వేదికగా ఆదివారం కీలకమైన మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీఫైనల్ ఆశలను మరింత బలోపేతం చేసుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
టీమిండియాకు ప్రధాన బలం బ్యాటింగే. అయితే ప్రస్తుత టోర్నీలో టీమిండియా తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మ.. ఇంత వరకు తన స్థాయి ఇన్నింగ్స్ ఆడ లేకపోయాడు. వరుసగా మూడు మ్యాచ్లలో 0 పరుగులకు అవుట్ అయ్యాడు. దీంతో అతని ఫామ్ గురించి అభిమానుల్లో ఆందోళన మొదలైంది. దీనికి తోడు సంజు శాంసన్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. నమిబియా జట్టుతో జరిగిన మ్యాచ్లో సంజు కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొని 22 పరుగులు చేశాడు. సంజు తన ఫామ్ ప్రదర్శించిన నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే సూపర్ 8 మ్యాచ్ లో ఎవరిని ఓపెనర్ గా దింపుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై గౌతమ్ గంభీర్ సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు.
దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే మ్యాచ్ కు అభిషేక్ శర్మను ఓపెనర్ గా దింపుతారని తెలుస్తోంది. ఎందుకంటే ఒక్క ఇన్నింగ్స్ ద్వారా అభిషేక్ శర్మ తన స్థాయి ఏమిటో నిరూపించుకుంటాడు. అతడికి ఫామ్ తో అవసరం లేదు. కాకపోతే తన బలహీనతలను అధిగమిస్తే ఖచ్చితంగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే మ్యాచ్ ద్వారా తన పునరాగమనాన్ని చాటుకుంటాడని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు.
అభిషేక్ శర్మ త్వరగా అవుట్ కావడం వల్ల ఆ ప్రభావం తిలక్ వర్మ మీద తీవ్రంగా పడుతోంది. అందువల్లే మధ్య ఓవర్లలో టీమిండియా స్కోరు నెమ్మదిస్తోంది. అయితే తిలక్ వర్మ అలా ఆడేందుకు తానే కారణం అంటూ ఇటీవల సూర్య కుమార్ యాదవ్ చెప్పాడు. మిడిల్ ఆర్డర్లో సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్ల మీద అంతగా ఆకట్టుకోలేకపోయాడు. హార్దిక్ పాండ్యా, శివం దుబే మాత్రం చివర్లో సత్తా చూపిస్తున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ అత్యంత పటిష్టంగా ఉండడంతో.. భారత బ్యాటర్లు దుమ్ము రేపాల్సి ఉంటుంది. పిచ్ ను నల్ల మట్టితో రూపొందించిన నేపథ్యంలో కులదీప్ యాదవ్ కంటే అర్ష్ దీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది.