Suryakumar Yadav Captaincy Tension: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది అనే సామెత తెలుసు కదా.. ఇప్పుడు ఇదే సామెత టీమ్ ఇండియాలో సూర్య కుమార్ యాదవ్ తీరుకు సరిపోయేలా ఉంది.. టీమిండియాలో టి20 కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ కొనసాగుతున్నాడు. ఇతడి నాయకత్వంలో టీమిండియా వరుసగా ట్రోఫీలు సాధించింది. చివరికి టి20 వరల్డ్ కప్ కూడా గెలిచింది. ఇంతటి స్థాయి ఉన్న సూర్య కుమార్ యాదవ్.. తన స్థానం మీద కంగారు పడుతున్నాడు. దీనికి ప్రధాన కారణం గౌతమ్ గంభీర్.
గౌతమ్ గంభీర్ పదవీకాలం 2027 తో ముగుస్తుంది. అయితే అతడు తన పదవి కాలాన్ని 2028 t20 వరల్డ్ కప్ వరకు పొడిగించాలని మేనేజ్మెంట్ వద్ద విన్నవించినట్టు తెలుస్తోంది. దీనిపై ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. గౌతమ్ గంభీర్ దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. బీసీసీఐ పెద్దలు కూడా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంకేతాలు ఇవ్వలేదు. అయినప్పటికీ జాతీయ మీడియాలో వార్తలు ఆగడం లేదు.
జాతీయ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం 2028 వరకు తన సర్వీస్ కాలాన్ని పాడగించాలని గౌతమ్ గంభీర్ మేనేజ్మెంట్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. గౌతమ్ గంభీర్ సర్వీస్ కాలాన్ని పొడిగిస్తే.. తనకు ఇబ్బంది తప్పదని సూర్య కుమార్ యాదవ్ భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. 2028లో అప్పటికి సూర్య కుమార్ యాదవ్ 35 సంవత్సరాల వయసు దాటుతాడు. అప్పుడు అతని వయసును సాకుగా చూపి కొత్త వాళ్లకు సారధ్య బాధ్యతలను అప్పగించడానికి గౌతమ్ గంభీర్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల కెప్టెన్సీ మార్పు గురించి కూడా చర్చ నడిచింది. దానిపై గౌతమ్ గంభీర్ పెదవి విప్పలేదు.
టి20 ఫార్మాట్ లో గౌతమ్ గంభీర్ గిల్ కు సారధ్య బాధ్యతలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాకపోతే గిల్ సరైన ఫామ్ లో లేకపోవడంతో.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని ఆ మధ్య విలేకరులు అడిగినప్పుడు సూర్య కుమార్ యాదవ్ పరోక్షంగా సమాధానం చెప్పాడు. “అంత బాగానే ఉంది కదా. ఇప్పుడు సారధిని మార్చాల్సిన అవసరమేముంది. నా స్థానాన్ని మార్చరని నేను అనుకుంటున్నాను. గిల్ నా స్నేహితుడు. అతడు అలాంటి పని చేస్తాడని నేను ఊహించనని” సూర్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు. సూర్య కుమార్ యాదవ్ కు 2028 సీజన్లో కూడా t20 కెప్టెన్ గా ఉండాలని ఉందట. జట్టుకు రెండోసారి ట్రోఫీ అందించి.. తన పేరును చరిత్రపుటల్లో స్థిరం చేసుకోవాలని ఉందట.
