CSK vs PBKS: గత ఐపిఎల్ లో పంజాబ్ జట్టు ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో ఓటమిని ఎదుర్కొంది. దీంతో తొలిసారి ఐపిఎల్ ట్రోఫీని అందుకోవాలి అనే కలను కలగానే మిగిల్చుకుంది పంజాబ్ జట్టు.
ఈ సీజన్లో పంజాబ్ జట్టు సరికొత్తగా కనిపిస్తోంది. మెగా వేలంలో అనుభవం ఉన్న ప్లేయర్లతోపాటు.. యంగ్ ప్లేయర్లను కూడా తీసుకుంది. దీంతో పంజాబ్ జట్టు సమ తూకంగా కనిపిస్తోంది. ప్లేయర్లు సమర్థవంతంగా రాణించడం వల్లే ఇటీవల గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. పంజాబ్ జట్టు విజయం సాధించిన నేపథ్యంలో.. శుక్రవారం చెన్నై తో జరిగే మ్యాచ్ లో పూర్తి ఆశావాహ దృక్పథంతో కనిపిస్తోంది.
ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ పంజాబ్ జట్టుకు అనుకోని ఉపద్రవం ఒకటి ఎదురైంది. ఈ ఉపద్రవం ఎదురయింది ప్రత్యర్థి జట్టు నుంచి కాదు. పంజాబ్ జట్టు సొంత ఆటగాడి నుంచి. ఇటీవల గుజరాత్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ జట్టు ఆటగాడు కూపర్ కన్నోలీ. కూపర్ గట్టిగా కొట్టడంతో బంతి నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న అయ్యర్ కు తగిలింది.. దీంతో తీవ్రంగా బాధపడ్డాడు.. నొప్పితో విలవిలలాడిపోయాడు. ఈ నేపథ్యంలో అతడు చెన్నై జట్టుతో జరిగే మ్యాచ్ కు దూరంగా ఉంటాడని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు పంజాబ్ జట్టు అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హడీన్ క్లారిటీ ఇచ్చాడు. గాయం తీవ్రమైనది కాదని స్పష్టం చేశాడు.
“అతడికి బంతి గట్టిగా తగిలింది. కాకపోతే అది ఎముకలు విరగొట్టే బలవంతమైనది కాదు. దెబ్బ తగిలిన ప్రాంతంలో వాపు కనిపించింది. దెబ్బ తగిలిన చోట కదలికను తిరిగి తీసుకురావడం కోసం జట్టు సిబ్బంది ప్రయత్నించారు. అది విజయవంతం అయింది కూడా. చెన్నై జట్టుతో జరిగే మ్యాచ్లో అయ్యర్ జట్టుకు అందుబాటులో ఉంటాడు. అతడు కీలకమైన ప్రాక్టీస్ సమయంలో ఉత్సాహంగా ఉన్నాడు. పరీక్షలను కూడా సులభంగా క్లియర్ చేశాడు. అతడి రికవరీ అద్భుతంగా ఉంది. గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ గెలుపొందింది.. అదే జోరు చెన్నై జట్టుతో జరిగే మ్యాచ్లో కూడా పంజాబ్ కొనసాగిస్తుందని” ఆశా భావం వ్యక్తం చేశాడు.
గత సీజన్లో పంజాబ్ జట్టును ఫైనల్ దాకా తీసుకెళ్లాడు అయ్యర్. ఒక్కడే జట్టులో పోరాట స్ఫూర్తిని నింపి.. తుది పోరు వరకు ప్రయాణం సాగించాడు. చివర్లో బెంగళూరు చేతిలో ఓడిపోయినప్పటికీ.. అయ్యర్ నాయకత్వ పటిమ యావత్ ప్రపంచాన్ని తెలిసింది. ఇప్పుడు కూడా అతడు అదే స్థాయిలో జట్టును నడిపిస్తాడని అభిమానులు అంచనాలు వేస్తున్నారు.
