Cricketer fined biggest penalty: కిమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది. ఉత్తరకొరియా అధ్యక్షుడిగా.. ప్రపంచంలోనే అతిపెద్ద నియంతగా.. హిట్లర్ ను మించిన క్రూరుడిగా అతడు వ్యవహరిస్తున్నాడు. కిమ్ గురించి మీడియాలో వార్తలు వస్తే.. ఎక్కడా లేని ఆసక్తి కలుగుతుంది. దానికి కారణం అతడు కొనసాగించే నియంత విధానాలే.
ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ను మించిపోయింది. ఓ ఆటగాడు ప్రశ్నించిన తీరును తట్టుకోలేక పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో అతడికి 20 మిలియన్ పాకిస్తాన్ రూపాయల జరిమానా విధించింది.. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఒక ఆటగాడికి క్రికెట్ బోర్డు ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే తొలిసారి. అలా జరిమానా ఎదుర్కొన్న ఆటగాడి పేరు నసీం షా. ఇటీవల పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నీ మొదలైంది. ప్రారంభ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి మరియం హాజరయ్యారు. ఆమెకు పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వాహకులు భారీగా స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో మరియం కు ఆ స్థాయిలో స్వాగతం పలకడాన్ని నసీం షా తీవ్రంగా తప్పుపట్టాడు.. “ఇది పాకిస్తాన్. ఆమెకు మాత్రం లార్డ్స్ యువరాణి మాదిరిగా స్వాగతం సత్కారాలు పలుకుతున్నారు.. ఇది ఎంతవరకు న్యాయం” అని నసీం షా ప్రశ్నించాడు. ట్విట్టర్లో అతడు ఈ పోస్ట్ చేశాడు.
పోస్ట్ కాస్త పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్వాహకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అతడు అలా ప్రశ్నించడం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలకు ఏమాత్రం నచ్చలేదు. వెంటనే అతడి మీద చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. అయితే ఆ పోస్ట్ చేసిన కొద్ది సమయానికి దానిని నసీం షా తొలగించాడు. క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యాడు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పాడు. అయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు ఒప్పుకోలేదు. వెంటనే అతనికి 20 మిలియన్ పాకిస్తాన్ రూపాయలను జరిమానాగా విధించారు.. అతడిని బ్లాక్ లిస్టులో పెట్టారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో ప్లేయర్లు నిబంధనలు అతిక్రమించడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆల్ రౌండర్ అమీర్ జమాల్ పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ కు బహిరంగంగా మద్దతు తెలిపాడు. దీనిని తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అతడికి 4000 డాలర్ల జరిమానా విధించింది. కాగా, నసీం షా పాకిస్తాన్ సూపర్ లీగ్ లో రావల్పిండి జట్టు తరఫున ఆడుతున్నాడు.
కాగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో నక్వీ పెత్తనం పెరిగిపోయిందని ఇటీవల కాలంలో విమర్శలు మొదలయ్యాయి. ఆటగాళ్లు కూడా అతడి వ్యవహార శైలిని తీవ్రంగా తప్పు పడుతున్నారు. తనకు అనుకూలంగా ఉన్న ఆటగాళ్లకు మాత్రమే అవకాశాలు దక్కే విధంగా నక్వి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందువల్లే పాకిస్తాన్ క్రికెట్ జట్టు వరుసగా ఓటములను ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా ఐసిసి నిర్వహించే మెగా టోర్నీలలో అట్టర్ ప్లాఫ్ అవుతున్నది. చివరికి సొంత దేశం వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పాకిస్తాన్ జట్టు గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది.