Homeజాతీయ వార్తలుసారూ...లాక్ డౌన్ సొమ్ము లూటీ అయింది?

సారూ…లాక్ డౌన్ సొమ్ము లూటీ అయింది?

తెలంగాణలో కరోనా కట్టడి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల ఇండ్లకే పరిమితమైన ప్రజలకు ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రతి కుటుంబానికి రూ.1500 అకౌంట్లో వేస్తున్నట్లు కేసీఆర్ సర్కార్ ప్రకటించింది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. ఏప్రిల్ 16నే రూ.1500 బ్యాంకు అకౌంట్లో వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ డబ్బులొస్తే తిండి ఖర్చులకు సరిపోతాయని పేదలు భావించారు. అనుకున్నట్లుగానే రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మందికి ఆ డబ్బులు వచ్చాయి. కానీ ఇప్పటికీ పలువురికి డబ్బులు అందక పోవడం గమనార్హం. ఎన్ని రోజులు ఎదురుచూసినా బ్యాంకుల్లో జమకాలేదు. బ్యాంక్ అకౌంట్లో పడని వారికి పోస్టాఫీసుల్లో ఇస్తున్నారని తెలిసి.. చాలా మంది అక్కడికి వెళ్లారు. ఎండలో క్యూలో నిలబడి డబ్బుల కోసం ఎదురుచూశారు. కానీ అక్కడ కూడా అదే పరిస్థితి. మీకు బ్యాంకులోనే పడ్డాయి.. ఇక్కడ ఇవ్వరని తిప్పి పంపారు.

ఈ విధంగా డబ్బుల కోసం ప్రజలు పలు చోట్లకు తిరిగారు. కానీ వారికి నిరాశే మిగిలింది. అలాంటి వారిని ఉద్దేశించి ఇటీవల మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. 1500 డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు epos.telangana.gov.in వెబ్‌ సైట్‌ కి వెళ్లి స్టేటస్ చెక్ చేసుకోవాలని చెప్పారు. మంత్రి సూచించినట్లు చాలా మంది ఆ వెబ్‌ సైట్‌ కు వెళ్లి చెక్ చేసుకున్నారు. అక్కడ స్టేటస్ చూసి షాక్ తిన్నారు. ఏప్రిల్ 16నే రూ.1500 బ్యాంకు అకౌంట్లో జమ అయినట్లు స్టేటస్ చూపింది. కానీ బ్యాంకుల్లో మాత్రం ఇప్పటికీ జమ కాలేదు. ప్రభుత్వం వేశామని చెబుతోంది.. బ్యాంకు అకౌంట్లో మాత్రం పడలేదు. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్లినట్లు..? ఇదే డౌట్‌ తో మంత్రి హరీష్ రావును చాలా మంది ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. సార్.. ఇదీ సమస్య.. ఏం చేయాలో చెప్పాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు.

ఇలాంటి సమస్యలుంటే 1967 టోల్ ఫ్రీ నెంబరు లేదా 040-23324614, 040-23324615 నెంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి హరీష్ రావు చెప్పడంతో తమ సమస్య తీరుతుందని చాలా మంది ఆ నెంబర్లకు ఫోన్ చేశారు. కానీ అందులో ఏ ఒక్కటి స్పందించడంలేదు. 1967 నెంబర్ అసలు మనుగడలోనే లేదట. మిగతా ఫోన్ నెంబర్లు ఎప్పుడు చేసినా బిజీ అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదలు నిరుత్సాహానికి గురవుతున్నారు. మన అదృష్టం బాగాలేదు.. ఆ డబ్బులు ఇక రావులే.. అని బాధపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి.. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అందరికీ చేరేలా చూడాలని మరికొందరు కోరుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించి కష్టకాలంలో తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular