Goebbels Villa: గజం స్థలం కోసమే ప్రాణాలు తీసుకుంటున్న రోజులివి. అలాంటిది 42 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఓ విల్లాను.. అది కూడా ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం చెబుతుంటే.. తీసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.. దీంతో ఆ భవనం కాస్త పాడుబడ్డ కొంపలాగా మారిపోయింది. అక్కడ దయ్యాలు కూడా కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు.. ఇంతకీ ఎక్కడ ఉంది ఆ విల్లా? ఏమిటి ఆ దయ్యాల కథ? ఈ కథనంలో తెలుసుకుందాం..
జర్మనీ దేశాన్ని హిట్లర్ పరిపాలిస్తున్న కాలంలో ఆయనకు అత్యంత సన్నిహితుడిగా జోసెఫ్ గోబెల్స్ పేరుపొందారు. అప్పట్లో హిట్లర్ స్థాపించిన నాజీ పార్టీకి గోబెల్స్ ప్రధాన ప్రచారకర్తగా ఉండేవాడు. ఆ రోజుల్లో వార్తాపత్రికలు, రేడియోలు, సినిమాల వంటి ప్రసార సాధనాలలో నాజీ పార్టీ గురించి విపరీతమైన ప్రచారం చేసేవాడు.. దాని భావజాలానికి యువకులు ఆకర్షితులయ్యేలా రకరకాల రూపాలలో ప్రచారం కొనసాగించేవాడు. ఈ క్రమంలో గోబెల్స్ తన ప్రైవేటు వ్యవహారాలు చక్కబెట్టుకునేందుకు జర్మనీ రాజధాని బెర్లిన్ కు 25 కిలోమీటర్ల దూరంలో 42 ఎకరాల విస్తీర్ణంలో ఒక విల్లాను నిర్మించుకున్నాడు.
ఈ విల్లా నుంచే గోబెల్స్ నాజీ పార్టీకి సంబంధించి ప్రచార వ్యవహారాలు కొనసాగించేవాడు. అక్కడ పలువురు సినీ తారలతో ప్రైవేట్ గా గడిపే వాడని ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే ఈ భవనం ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ భవనానికి దాదాపు 90 ఏళ్ల చరిత్ర ఉండడంతో.. దానిని కాపాడటం ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందిగా మారింది.. పైగా ఈ భవనానికి నాజీ పార్టీతో సంబంధం ఉన్న నేపథ్యంలో.. దీనిని వదిలించుకోవాలని జర్మనీ ప్రభుత్వం భావిస్తోంది.” ఈ విల్లాను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఒక రకంగా బహుమతి అనుకోవచ్చు.. దానిని సొంతం చేసుకోవాలనుకుంటే ఎవరైనా ముందుకు రావచ్చని” జర్మనీ ఆర్థిక శాఖ మంత్రి స్టెపాన్ అవర్స్ ప్రకటించారు.
ఈ భవనంలో 2000 సంవత్సరం కంటే ముందు కొంతమంది నివసించేవారు. ఆ తర్వాత వారు ఈ భవనాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు ఖాళీ చేశారనేది ఇంతవరకూ తెలియ రాలేదు. ఈ భవనంలో దయ్యాలు ఉండటం వల్లే వారు ఖాళీ చేసి వెళ్లిపోయారనే వాదనలున్నాయి. నాజీ పార్టీ కోసం గోబెల్స్ ఈ భవనంలో చాలామందిని చంపాడట. వారి ఆత్మలు దయ్యాలుగా తిరుగుతున్నాయట. అందువల్లే అది దయ్యాల విల్లాగా మారిపోయిందట. అందువల్లే ఈ విల్లాను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. ప్రస్తుతం ఈ భవనం రోజురోజుకు దెబ్బతింటున్నది. అందువల్లే కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదట. దీంతో ప్రభుత్వమే ఉచితంగా ఇస్తామని ప్రకటన చేసిందట. ఒకవేళ దీనిని సొంతం చేసుకునేందుకు ఎవరూ ముందుకురాని పక్షంలో.. ఆ భవనాన్ని ధ్వంసం చేస్తామని జర్మనీ అధికారులు చెబుతున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉన్నప్పుడు గోబెల్స్ ఈ భవనంలో ఆత్మహత్య చేసుకున్నాడు. తను మాత్రమే కాదు భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.