Stem Cell Therapy for Diabetes: కొంతకాలంగా ప్రపంచ వ్యాప్తంగా షుగర్ అనేది చాప కింద నీరు లాగా విస్తరిస్తోంది. ఆ వ్యాధి బారిన పడి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. షుగర్ అనేది హార్మోన్ లోపం వల్ల సంభవించే వ్యాధి. ఆ తర్వాత అది అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. ముఖ్యంగా షుగర్ వ్యాధి వల్ల మూత్రపిండాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. రోగ నిరోధక వ్యవస్థ పూర్తిగా తగ్గిపోతుంది. తద్వారా ఇతర వ్యాధులు కూడా శరీరం మీద దాడి చేస్తాయి.
షుగర్ అనేది నయమయ్యే వ్యాధి కాదు. దానిని నియంత్రణలో ఉంచుకోవడమే మార్గం. సక్రమమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని సాగించాలి. ఉదయం జాగింగ్.. సమీకృత ఆహారం తీసుకోవడం ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. శరీర జీవన క్రియలను పూర్తిగా మార్చుకుంటే షుగర్ అనేది నియంత్రణలో ఉంటుంది.
షుగర్ ను నియంత్రణలో ఉంచడానికి మాత్రమే ప్రస్తుతం మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులు కూడా దీర్ఘకాలం వాడితే శరీరంపై ప్రభావం తప్పదు. అందువల్లే కొన్ని సంవత్సరాలుగా షుగర్ నివారణ కోసం శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లకు షుగర్ మీద మనిషి గెలిచే సందర్భం వచ్చింది.
చైనా శాస్త్రవేత్తలు మూల కణం ఆధారంగా చేసే థెరపీ ద్వారా షుగర్ వ్యాధిని నివారించవచ్చని నిరూపించారు. కొంతకాలంగా స్టెమ్ సెల్ థెరపీ మీద చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. షాంగై లోని చాంగ్ జంగ్ ఆసుపత్రికి చెందిన శాస్త్రవేత్తలు స్టెమ్ సెల్ థెరపీ ద్వారా 59 సంవత్సరాలు వ్యక్తికి సోకిన టైపు 2 డయాబెటిక్ మొత్తాన్ని నయం చేశారు. గడిచిన 25 సంవత్సరాలుగా ఆ వ్యక్తి షుగర్ వ్యాధితో బాధపడుతున్నాడు.
ఈ చికిత్సలు శాస్త్రవేత్తలు ఆ రోగికి సంబంధించిన రక్త కణాల నుంచి స్టెమ్ సెల్స్ రూపొందించారు. వాటికి ఇన్సులిన్ ఉత్పత్తి చేసే ప్యాంక్రియాటిక్ ఐలెట్ కణాలుగా మార్చారు. ఆ తర్వాత వాటిని అతడి శరీరంలోకి ప్రవేశపెట్టారు.
11 వారాల తర్వాత ఆ వ్యక్తి ఇన్సులిన్ తీసుకోవడాన్ని మానేశాడు. షుగర్ నియంత్రణ కోసం వాడే ఇతర మందులను కూడా ఆపేశాడు. గడచిన 33 నెలలుగా అతడు ఎటువంటి మందులు వాడటం లేదు. సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ రోగుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.
అయితే ఆ ఒక్క వ్యక్తిపై చేసిన ప్రయోగం విజయవంతమైనది. ఇదే విధానాన్ని ప్రపంచ వ్యాప్తంగా అందరికీ అందుబాటులో తీసుకురావాలి అంటే ఇంకా చాలా రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. 2024 లో టైప్ వన్ డయాబెటిస్ లక్షణాలున్న ఒక మహిళపై ఇదేవిధంగా ప్రయోగాలు చేశారు. అదే ఆమెకు ఆ వ్యాధి నయమైనట్టు తెలుస్తోంది. అయితే చైనా శాస్త్రవేత్తల ప్రయోగాలు ఇంకా చివరి దశకు చేరుకోలేదు. అలాంటప్పుడు స్టెమ్ సెల్ థెరపీ ఇప్పుడప్పుడే అందుబాటులోకి రాదు.