Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే గుర్తించారు. ఇందులో భాగంగా వేల ఏళ్ల క్రితమే రాజులు, పాలకులు నదుల ప్రవాహాన్ని నియంత్రించేందుకు చెరువులు, కాలువలు, ఆనకట్టలు నిర్మించారు. ఈ నిర్మాణంలో భాగంగా భారతదేశంలో అతి పురాతనమైన డ్యామ్ గా తమిళనాడులో ఉన్న కళ్ళనై ప్రత్యేకంగా నిలుస్తుంది. అసలు ఈ డ్యామ్ ను ఎప్పుడు నిర్మించారు? ఎలా నిర్మించారు? ఈ డ్యామ్ విశేషాలు ఏంటి?
భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే పురాతనమైన నీటిపారుదల ప్రాజెక్టుల్లో తమిళనాడులోని కళ్లనై డ్యామ్ ప్రత్యేకంగా నిలుస్తుంది. దీనిని గ్రాండ్ ఆనికట్ అని కూడా పిలుస్తారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం దీనిని నిర్మించినట్లు చరిత్ర తెలుపుతోంది. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు, తిరుచిరాపల్లి జిల్లాల మధ్య ఉన్న ఈ డ్యామ్ రెండవ శతాబ్దానికి చెందినదిగా పేర్కొంటున్నారు.
పురాణాల ప్రకారం చోళ రాజు కరికాల చోళుడు కావేరి నది ప్రవాహాన్ని నియంత్రించి, డెల్టా ప్రాంతంలోని వ్యవసాయానికి నీటిని అందించేందుకు కళ్లనై డ్యామ్ ను నిర్మించినట్లు చెబుతున్నారు. అప్పట్లో కావేరి వరదలు విపరీతంగా ఉండేవి. కానీ వ్యవసాయానికి నీరు మాత్రం అందేవి కాదు. దీని ప్రవాహాన్ని నియంత్రిస్తే వ్యవసాయం పండుతుందని భావించి ఈ డ్యామ్ ను నిర్మించారు.
కళ్లనై డ్యామ్ నిర్మాణంలో ప్రధానంగా రాళ్ళను ఉపయోగించారు. ఈ పురాతన ఆనకట్ట సుమారు 329 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు కలిగే ఉంది. ఈ ఆనకట్ట కావేరీ నది నీటిని నియంత్రించడం తో పాటు సరైన దిశలో నీటిని మళ్లించేలా ప్రత్యేకంగా నిర్మించారు. సాధారణంగా డాం లేదా రిజర్వాయర్లు నీటిని నిల్వ చేసి వరదలు వచ్చినప్పుడు కిందికి వదులుతారు. కానీ కళ్లనై డ్యామ్ ఉద్దేశం వేరు. ఇది కావేరీ నది ప్రవాహాన్ని నియంత్రించి డెల్టా ప్రాంతాలకు నీటిని మళ్లిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలో ఇప్పుడు లక్షలాది ఎకరాల్లో వ్యవసాయం అభివృద్ధి చెందింది.
2000 సంవత్సరాల కింద నిర్మించిన ఈ డ్యామ్ ఇప్పటికీ నాణ్యతతో కొనసాగుతుంది. కాలక్రమంలో ఈ ప్రాంతంలో అనేక మార్పులు, ఆధునిక నిర్మాణాలు చేసుకున్నప్పటికీ.. పురాతన కట్టడాలు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ డ్యామ్ ను అభివృద్ధి చేయడంలో బ్రిటిష్ పాలకులు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు తెలుస్తోంది. కళ్లనై డ్యామ్ కేవలం నీటిని అందించడమే కాకుండా పర్యాటక ప్రదేశంగా ప్రఖ్యాతను కలిగి ఉంది. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉల్లాసంగా గడుపుతారు. ఈ ఆనకట్ట పై నిర్మించిన వంతెన, రోడ్డుతో ఈ ప్రాంతం సుందరమయంగా మారిపోయింది. అయితే దీనిని దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పురాతనమైన డ్యామ్ గా పేర్కొంటున్నారు.




