TDP 44th Anniversary USA: అమెరికాలోని బే ఏరియాలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మిల్పిటాస్ పట్టణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొని ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు.
కార్యక్రమం ప్రారంభంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ కట్ చేసి వేడుకలను కొనసాగించారు.

ఈ సందర్భంగా ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్ జూమ్ కాల్ ద్వారా పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో విశేష మార్పులు తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. సమాజంలో ఉన్న రాజకీయ అసమానతలను తొలగించి, బడుగు బలహీన వర్గాలకు అధికారం అందేలా చేసిన పార్టీగా టీడీపీ నిలిచిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు. కొత్త రాజకీయ ఆవిష్కరణలకు టీడీపీ ఒక ప్రయోగశాలగా మారిందని అభిప్రాయపడ్డారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ, టీడీపీ 44 ఏళ్ల ప్రయాణంలో 24 సంవత్సరాలు అధికారంలో, 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలిచిందన్నారు. ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాలు చేపట్టిన పార్టీగా టీడీపీ గుర్తింపు పొందిందని తెలిపారు.

వెంకట్ కోగంటి మాట్లాడుతూ, తెలుగుజాతికి పూర్వ వైభవం తీసుకురావడంలో, ఆంధ్రప్రదేశ్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో చంద్రబాబు పాత్ర కీలకమని చెప్పారు. ఆయన తీసుకొచ్చిన ఐటీ విప్లవం వల్లే తాము అమెరికాలో స్థిరపడగలిగామని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని రాజశేఖర్ పర్వతనేని సమన్వయం చేశారు. కార్యక్రమంలో విజయ్ గుమ్మడి, శ్రీకాంత్ దొడ్డపనేని, శ్రీనివాసు తడపనేని, విజయ్ జెట్టి, వెంకట్ అడుసుమల్లి, సుబ్బా యంత్ర, రమేష్ మల్లారపు, రవి అడుసుమల్లి, హరి సన్నిధి, నరేంద్ర రెడ్డి యన్నం, భాస్కర్ మొలకలపల్లి, రవి కిరణ్, ఎంవీ రావు, భరత్ ముప్పీరాల, గాంధీ పాపినేని, శివ అద్దంకి, జగదీష్ గింజుపల్లి, రామ్ తోట, శ్రీనివాస్ వల్లూరుపల్లి, సురేష్ పోతినేని, శశి దొప్పలపుడి, భాస్కర్ అన్నే, వాసు బండ్ల, రాజా కొల్లి, సీతారాం కొడాలి, భాస్కర్, చంద్ర గుంటుపల్లి, శ్రీనివాస్ పొటకమూరి తదితరులు పాల్గొన్నారు.
ఈ వేడుకలు ప్రవాసాంధ్రుల్లో టీడీపీ పట్ల ఉన్న అనుబంధాన్ని, పార్టీపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి ప్రతిబింబించాయి.