TANA President Lavu Anjaiah Chowdary : జన్మనిచ్చిన సొంత గ్రామానికి సేవ చేయటంలో కలిగే సంతృప్తి మరెక్కడా దొరకదని తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి ఆర్.సీఎం స్కూల్ లో ‘తానా చైతన్య స్రవంతి’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మెగా క్యాన్సర్ క్యాంపు, వైద్యశిబిరం, కంటి వైద్య శిబిరం, రైతు కోసం అనాథ పిల్లలకు దుస్తులు, స్కాలర్ షిప్ లు అందజేశారు. అలాగే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. ‘తానా ఆధ్వర్యంలో తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో సంప్రదాయ, సాంస్కృతిక కళలు, సేవా కార్యక్రమాలు డిసెంబర్, జనవరి నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతరించిపోతున్న సంస్కృతిక సంప్రదాయాలు, మళ్లీ మనవారికి పరిచయం చేసేందుకు తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించే సంస్కృతిక కళోత్సవాలు ఎంతగానో దోహదపడుతాయన్నారు.
జన్మనిచ్చిన స్వగ్రామాలకు తమ వంతు బాధ్యతగా సేవ చేయాలనే ఉద్దేశంతో తానా చైతన్య స్రవంతి అద్భుత కళాధామం, అంకిత సేవాభావం పేరుతో డిసెంబర్, జనవరి నెల మొదటి వారంలో తానా ఆధ్వర్యంలో సాంస్కృతిక కళోత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని లావు అంజయ్య చౌదరి తెలిపారు. విద్యార్థులకు సహాయం, రైతులకు సాయం, తదితర శిక్షణ కార్యక్రమాలతోపాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తానా ప్రధాన ఉద్దేశం అంతరించిపోతున్న కళలు, సాంస్కృతిక , చెక్క భజన, కోలాటం జానపద నృత్యాలు పాటలను ప్రోత్సహించడంతోపాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తెలుగు ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. అందుకు ప్రతీ ఒక్కరి సహకారం అవసరం అన్నారు.
ఈ కార్యక్రమంలో గన్నవరం టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్, మాజీ మంత్రులు దేవినేని ఉమా, మాజీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ప్రత్తిపాటి పుల్లారావు, తానా సభ్యులు పాల్గొన్నారు.