Trump humiliation in China: ప్రపంచ ఆర్థిక శక్తిగా అమెరికా ఉన్నప్పటికీ.. కొంతకాలంగా చైనా దూకుడు ముందు తట్టుకోలేకపోతోంది. తయారీ రంగం నుంచి మొదలుపెడితే సైన్స్ అండ్ టెక్నాలజీ వరకు ఇలా అన్ని విషయాలలో చైనాతో అమెరికా పోటీ పడలేకపోతోంది. చైనాను తొక్కిపెట్టే ప్రయత్నాలు అనేకం చేస్తున్నప్పటికీ అవి సాధ్యం కావడం లేదు. పైగా చైనా అమెరికాకు దిమ్మతిరిగే విధంగా సమాధానాలు చెబుతోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు చైనాలో పర్యటిస్తున్నారు. అనే రకాలైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. తొమ్మిది సంవత్సరాల తర్వాత ట్రంప్ చైనాలో పర్యటిస్తున్న నేపథ్యంలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. అమెరికా అధ్యక్షుడికి చైనాలో జరిగిన ఘోర అవమానం మరొక ఎత్తు. వెస్ట్రన్ మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు ఇప్పుడు విస్తృతంగా సర్కులేట్ అవుతున్నాయి.
చైనాలో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు భద్రతను పర్యవేక్షించే కమాండింగ్ వ్యవస్థలు పనిచేయలేదు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల పాచికలు చైనాలో పారలేదు. అంతేకాదు ట్రంప్ పర్యటిస్తున్న వేళ చైనా సెక్యూరిటీ సిబ్బంది అమెరికన్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నది.. ట్రంప్ సమావేశ వేదిక వద్ద మాట్లాడుతుంటే చైనా జర్నలిస్టులు దూసుకు వచ్చారు… వైట్ హౌస్ సిబ్బందిని మొత్తం నెట్టేశారు. ఈ ఘటనలో అమెరికా సిబ్బంది ఒకరికి గాయాలయ్యాయి. దీనిపై అమెరికన్ అధికారాలు నిరసన వ్యక్తం చేసినప్పటికీ ఉపయోగాలు లేకుండా పోయింది.
ట్రంప్, జిన్ పింగ్ బీజింగ్ లోని టెంపుల్ ఆఫ్ హెవెన్ ను సందర్శిస్తున్న సమయంలో.. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వద్ద తుపాకీ ఉందని గుర్తించిన చైనా అధికారులు.. అతడిని గుడిలోకి పంపించలేదు. అంతేకాదు తుపాకీ స్వాధీనం చేసిన తర్వాతే లోపలికి వెళ్లాలని సూచించారు. దానికి అమెరికా ప్రతినిధి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో చైనా, అమెరికా అధికారుల వద్ద ఘర్షణ జరిగింది. చాలాసేపటి తర్వాత చైనా అధికారులు ఒప్పుకున్నప్పటికీ.. తుపాకీ ఉన్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ బయట ఉండిపోవాల్సి వచ్చింది.
టెంపుల్ ఆఫ్ హెవెన్ ను దర్శించుకున్న తర్వాత ట్రంప్ ను ప్రెసిడెన్షియల్ మోటార్ కేడ్ లో కలవనీయకుండా అమెరికన్ జర్నలిస్టులను చైనా అధికారులు అడ్డుకున్నారు. కొద్దిసేపు ఘర్షణ జరిగిన తర్వాత అమెరికా జర్నలిస్టులు ట్రంప్ కాన్వాయ్ ను అందుకున్నట్టు తెలుస్తోంది. ఇవి కేవలం వెలుగులోకి వచ్చినవి మాత్రమే.. ట్రంప్ పర్యటన సమయంలో చైనా అనేక రకాల అడ్డంకులు సృష్టించింది. అమెరికా రిపోర్టర్లకు నీళ్ల సీసాలు కూడా ఇవ్వలేదు. వాష్ రూమ్ వినియోగించే విషయంలో కూడా పరిమితి విధించింది. మరోవైపు ఫాక్స్ న్యూస్ కు సంబంధించిన ఒక వ్యాన్ నో పార్కింగ్ ఏరియాలో పార్కింగ్ చేయడంతో.. ఫైన్ విధించారు. గతంలో కూడా చైనా అధికారులు ఇలానే ట్రంప్ పర్యటిస్తున్నప్పుడు అమెరికన్ జర్నలిస్టులను నియంత్రించారు. అయితే ఈ కథనాలను అమెరికా తోసి పుచ్చడం విశేషం. వీటిపై చైనా ఇంతవరకు స్పందించలేదు.
