IPL 2022: క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేం. అద్భుతంగా రాణిస్తుందనుకున్న టీమ్ దారుణంగా ఓడిపోవచ్చు. అసలు గెలుపు పోటీలోనే లేని టీమ్ దుమ్ము లేపొచ్చు. ఏదైనా చివరి వరకు క్రికెట్ లో వేచి చూడాల్సిందే. ఎందుకంటే ముందు వచ్చిన ఫలితాలతో అంతిమ ఫలితాలను పోల్చొద్దు. ముఖ్యంగా ఈ సారి ఐపీఎల్ సీజన్ను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గతంలో అనేక సార్లు ఛాంపియన్లుగా నిలిచిన చెన్నై, ముంబై జట్లు దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి.

చెన్నై నాలుగు సార్లు, ముంబై ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచాయి. కానీ ఈ సారి మాత్రం వరుసగా నాలుగు మ్యాచ్లలో ఓడిపోయాయి. దీంతో ఆ రెండు జట్ల ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉండగా.. చెన్నై మాత్రం కోలుకుని ఆర్సీబీ మీద బోణీ కొట్టింది. దీంతో ఇప్పుడు అందరూ ముంబైవైపు చూస్తున్నారు. చెన్నై లాగే కోలుకుని విజయాల బాట పట్టాలని ఆశిస్తున్నారు.
మరి ముంబైకి ఇలాంటి గడ్డు పరిస్థితులు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. మొన్న జరిగిన మెగా వేలంలో చాలామంది కీలక ఆటగాళ్లను కోల్పోయింది. ఇక టీమ్ లోకి కొత్తగా వచ్చిన వారి నుంచి ఆశించిన ఫలితాలు రావట్లేదు. దాంతో రోహిత్ సేన ఢీలా పడిపోతుంది. కానీ ఇదే సమయంలో ఓ సారి చరిత్ర చూసుకుంటే ఆ జట్టు ఎంత బలమైందో అర్థమవుతుంది.
గతంలో 2014, 2015లొ కూడా ముంబై ఇలాగే వరుసగా మొదటి నాలుగు మ్యాచ్లు ఓడిపోయింది. 2014లో నాలుగు మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత అనూహ్యంగా పుంజుకుని ప్లే ఆఫ్స్ దాకా వెళ్లింది. ఆ సీజన్లో ఐదో స్థానంలో ఉంది. ఇక 2015లో అయితే అద్భుతం చేసి చూపించింది. మొదటి నాలుగు మ్యాచ్ లలో ఓడిపోవడంతో ఆ టీమ్ పని అయిపోయిందని అనుకున్నారు.

కానీ తిరుగులేని ఫామ్ తో వరుస విజయాలను ఖాతాలో వేసుకుని ఫైనల్ కు వెళ్లింది. ఫైనల్ మ్యాచ్లో చెన్నైని ఓడించి మరీ టైటిల్ గెల్చుకుంది. అంటే ఎలాంటి గడ్డు పరిస్థితులను అయినా ఎదుర్కునే సత్తా రోహిత్ సేనకు ఉందన్న మాట. ఇక ఈ రోజు తన ఐదో మ్యాచ్ను పంజాబ్ తో ఆడబోతోంది. ఈ మ్యాచ్లో ముంబై పునరాగమనం చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
అయితే గత సీజన్లలో ముంబైకు వెన్నుముకలా నిలిచిన హార్థిక్ పాండ్యా, లసిత్ మలింగా, కృనాల్ పాండ్యా లాంటి కీలక ఆటగాళ్లు ఈ సారి లేరు. దాంతో మిడిల్ ఆర్డర్ లో బ్యాట్ ఝుళిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు కరువయ్యారు. పైగా బౌలింగ్ సమస్య కూడా వెంటాడుతోంది. అటు పంజాబ్ కూడా కొంత ఒత్తిడిలోనే కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్ ముంబైకు కీలకం కానుంది. మరి రోహిత్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో వేచి చూడాలి.