Amulets Danger : మన దేశంలో వైద్యం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉంటున్నాయి. ఏదైనా అనారోగ్యం లేదా అనుకొని సంఘటనలు జరిగితే వైద్యుల కంటే ముందుగా భూత వైద్యుడిని సంప్రదిస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా ఏడ్చినా.. అనారోగ్యం కలిగినా.. తాయత్తులు కట్టిస్తారు. అయితే ఈ తాయత్తులు ఒక్కోసారి ఉరి తాడు లాగా మారే ప్రమాదం ఉందని ఓ వైద్యుడు హెచ్చరించాడు. ఎందుకంటే?
ఇటీవల ఓ చిన్నారికి అనారోగ్యం కలగడంతో పిల్లల వైద్యుడు దగ్గరికి వచ్చారు. అయితే ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలో ఆ చిన్నారి మెడలో ఉన్న తాయత్తులు చూసి డాక్టర్ షాక్ అయ్యాడు. ఆ చిన్నారి మెడలో చాలావరకు తాయత్తులు ఉండడంతో అవి అనుకోని విధంగా మెడకు చుట్టుకునే ప్రమాదం ఉందని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చాడు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వైద్యుడిని సంప్రదించాలని.. ఇలాంటి మూఢనమ్మకాల వైపు వెళ్లొద్దని చెప్పారు. అంతేకాకుండా ఈ తాయత్తులపై చేసే ఖర్చుతో పిల్లలకు పౌష్టికాహారం అందించాలని.. అలా అందిస్తే అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు.
అయితే చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ చిన్న పిల్లల మెడలో తాయత్తులు కనిపిస్తూనే ఉంటాయి. ఒకవేళ వీటిని తల్లిదండ్రులు బాగా నమ్మితే.. వారి మెడలో జాగ్రత్తగా ధరించాలి. దారం బిగుతుగా ఉంటే చిన్న పిల్లలు ఆడుకుంటూ మెడకు చుట్టుకొనే ప్రమాదం ఉంది. అందువల్ల ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదని వైద్యులు తెలుపుతున్నారు. ఎక్కువగా రాత్రిళ్ళు పిల్లలు ఏడుస్తున్నారని వీటిని మెడకు కడుతూ ఉంటారు.. కానీ నోటి సమస్యలు లేదా నిద్రలేమి సమస్యలు, గ్యాస్, కడుపునొప్పి వంటి సమస్యలతో వీరు రాత్రిళ్లు ఏడుస్తారని వైద్యులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వైద్య సలహా మేరకు అందుబాటులో ఉన్న మెడిసిన్ ఉపయోగించాలని తెలుపుతున్నారు.
అలా కాకుండా మూఢనమ్మకాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే.. చికిత్స ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో మరింత ప్రమాదానికి గురవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.