Vaibhav Suryavanshi : అందరూ ఉద్దండులే. ఎవరిని పక్కన పెట్టాలో తెలియదు. ఎవరిని జట్టులోకి తీసుకుంటే.. ఎవరి మీద వేటు వేయాలో అర్థం కావడం లేదు. ఏమైనా లోపాలు ఉన్నాయంటే.. ఏవీ కనిపించడం లేదు. పైగా ప్రతి ఒక్క ఆటగాడికి బలమైన అభిమానుల నేపథ్యం ఉంది. పొరపాటున ఏదైనా నిర్ణయం తీసుకుంటే సోషల్ మీడియాలో ఏకిపడేస్తారు. దీంతో ఏమి చేయలేని పరిస్థితి లో కొట్టుమిట్టాడుతోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
భారత క్రికెట్ నియత్రణ మండలి గతంలో ఎన్నడు కూడా ఈ స్థాయిలో ఒత్తిడి ఎదుర్కోలేదు. దీనంతటికీ ప్రధాన కారణం వైభవ్ సూర్య వంశీ. ఈ 15 సంవత్సరాల కుర్రాడు ఐపీఎల్ లో సృష్టిస్తున్న సంచలనాల వల్ల.. బీసీసీఐ పెద్దలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. 15 సంవత్సరాల ప్రాయంలోనే ఇతడు సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఎంత పెద్ద గొప్ప బౌలర్ అయినా సరే వీర విహారం చేస్తున్నాడు. తాను ఎదుర్కొన్న తొలి బంతిని సిక్సర్ లేదా ఫోర్ కొడుతున్నాడు. లెగ్ సైడ్ వద్ద వచ్చే బంతులను ఏమాత్రం కనికరించడం లేదు. కొట్టుడు కొడితే ఎక్కడో స్టాండ్స్ అవతల పడుతోంది బంతి. దీంతో అతని బ్యాటింగ్ చూసి ఆశ్చర్యపోయిన ఆటగాళ్లు చాలామంది. చివరికి ప్రత్యర్థి జట్టులో ఉన్న ప్లేయర్లు కూడా సూర్యవంశీ ఆట తీరును అభినందించకుండా ఉండలేకపోతున్నారు.
వైభవ్ సూర్య వంశీ ఆట తీరు గొప్పగా ఉన్న నేపథ్యంలో మేనేజ్మెంట్ జాతీయ జట్టులోకి తీసుకోవాలని భావించింది. ఇటీవల కాలంలో డిమాండ్లు వ్యక్తం కావడంతో బీసీసీఐ పెద్దలు సానుకూల దృక్పథంతో ఉన్నారట. ఇప్పుడు ఆ దృక్పధమే బీసీసీఐ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. వచ్చే ఐర్లాండ్ పర్యటనకు జాతీయ జట్టును ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ఎంపికలో షార్ట్ లిస్టులో సూర్య వంశీ పేరు ఉందని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అతడిని ఫైనల్ జట్టులోకి తీసుకుంటే.. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. ఇషాన్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంజు ఐపిఎల్ లో తొలి సెంచరీ నమోదు చేసిన ఆటగాడుగా నిలిచాడు. వీరిలో ఒకరిని తీసేసినా సరే పరిస్థితి తారుమారవుతుంది. ఎందుకంటే ఈ ప్లేయర్లకు బలమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అప్పుడు అభిమానులు అడిగే ప్రశ్నలకు బోర్డు పెద్దలు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక 2024 t20 వరల్డ్ కప్ తర్వాత 20 లోపు యావరేజ్ తో ఉన్న సూర్య కుమార్ యాదవ్.. ఆ తర్వాత దుమ్మురేపాడు.. టి20 వరల్డ్ కప్ లో సత్తా చూపించి టీమ్ ఇండియాకు టోపీ అందించాడు. ఒకవేళ అతడిని పక్కనపెట్టి.. సూర్య వంశీ కి చోటు కల్పిస్తే ఎలా ఉంటుందని ఆలోచన కూడా బోర్డు పెద్దలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
“15 సంవత్సరాల కుర్రాడు సంచలనాలు సృష్టిస్తున్నాడు. చివరికి బోర్డు పెద్దలను కూడా కలవరపాటుకు గురి చేస్తున్నాడు. అతడి ఆట తీరు అలా ఉంది మరి. అతడు కదం తొక్కితే పరుగుల వరద సాగుతోంది. ఇలా ఆడుతున్న అతడు భవిష్యత్తు కాలంలో ఎటువంటి సంచలనాలు సృష్టిస్తాడో తెలియదు గాని.. అతడు మాత్రం బోర్డు పెద్దలకు కొత్త తలనొప్పి తీసుకొస్తున్నాడని” విశ్లేషకులు చెబుతున్నారు.