ఏపీలో పలు ప్రాజెక్టుల నిర్మాణంలో శ్రద్ధ వహించని ప్రభుత్వం పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలనడం ఎంత వరకు సమంజసమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు పనులను సోమవారం ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి ఎల్ ఎన్ డీ పేట వద్ద నిర్మించిన పునరావాస కాలనీకి వెళ్లారు. నిర్వాసితులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు కు రూ. 11 వేల కోట్లు ఇచ్చిందన్నారు. అందులో రూ. 7 వేల కోట్లు ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 4 వేల కోట్లు పునరావాసానికి ఖర్చు చేశారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల విషయంలోనూ శ్రద్ధ వహించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ఆయన వెంట రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రాజు, మహిళా మోర్చ అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, జిల్లా అధ్యక్షుడు సుధాకర్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి నాగరాజు తదితరులు ఉన్నారు.