IND vs NZ Final 2026 : టి20 వరల్డ్ కప్ లో భాగంగా అహ్మదాబాద్ లో ఆదివారం న్యూజిలాండ్, టీమిండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. అహ్మదాబాద్ లో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఆ చర్చ మొత్తం భారత ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రంగా సాగుతూ ఉండడం విశేషం.
నరేంద్ర మోడీ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. నాటి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓడిపోయింది. లీగ్ నుంచి సెమీఫైనల్ దాకా ఏ ఒక్క మ్యాచ్ కూడా టీమిండియా ఓడిపోలేదు. కానీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవడంతో టీమిండియా ఆటగాళ్లు తీవ్రంగా బాధపడ్డారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే ఫైనల్ మ్యాచ్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.
ఆదివారం జరిగే టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 2023లో ప్రధానమంత్రి వచ్చినప్పుడు టీమిండియా వన్డే వరల్డ్ కప్ కోల్పోయిందని.. ఇప్పుడు కూడా అదే జరుగుతుందేమోనని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఇక టి20 వరల్డ్ కప్ మ్యాచ్లలో న్యూజిలాండ్ తో టీమిండియా మూడుసార్లు తలపడింది. మూడుసార్లు కూడా ఓడిపోయింది. ఒకవేళ ఇప్పుడు టీమిండియా న్యూజిలాండ్ జట్టు మీద గెలిచి.. వరల్డ్ కప్ సాధిస్తే వరుసగా రెండవసారి ఈ ఘనత అందుకున్న జట్టుగా టీమిండియా ఆవిర్భవిస్తుంది. సెమీఫైనల్ లో బలమైన ఇంగ్లాండ్ జట్టును టీమిండియా ఓడించింది. ఆ మ్యాచ్లో భారీ స్కోర్ చేసినప్పటికీ.. విజయం కోసం టీమిండియా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మరోవైపు సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా జట్టును న్యూజిలాండ్ ఓడించింది. అదేవిధంగా టీమిండియా అని కూడా ఓడించాలని న్యూజిలాండ్ భావిస్తుంది.
ఒకవేళ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్లో గెలిస్తే.. తొలిసారి టి20 వరల్డ్ కప్ అందుకున్న జట్టుగా ఆవిర్భవిస్తుంది. అంతే కాదు వరల్డ్ కప్లలో అన్ని మ్యాచ్లలో టీమిండియాను ఓడించిన జట్టుగా న్యూజిలాండ్ రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ టీమిండియా కనక గెలిస్తే వరుసగా రెండవసారి టి20 వరల్డ్ కప్ సాధించిన జట్టుగా ఆవిర్భవిస్తుంది. గత సీజన్లో న్యూజిలాండ్ జట్టు సెమి ఫైనల్ దాకా కూడా రాలేదు. అంతకుముందు వచ్చినప్పటికీ ఆ జట్టు విఫలమైంది. ఐసీసీ టోర్నీలలో 15 సార్లు ఫైనల్ వచ్చినట్టుగా టీమిండియా నిలిస్తే.. న్యూజిలాండ్ 8 సార్లు మాత్రమే ఫైనల్ చేరుకుంది. అయితే అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. మ్యాచ్ కోసం ప్రత్యేక అతిధిగా ప్రధానమంత్రి వస్తున్న నేపథ్యంలో మోడీ గండం టీమిండియా కు పొంచి ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.