BJP election results 2026 : 2014లో అధికారంలోకి వచ్చింది. 2019లో కూడా అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. 2014 తో పోల్చి చూస్తే 2019లో స్థానాల సంఖ్యను భారీగా పెంచుకుంది.. 2024 మాత్రం పరిస్థితి అంత గొప్పగా లేదు. అనుకున్న స్థాయి కంటే స్థానాలు తక్కువగా వచ్చాయి. దీంతో కూటమిగా ఏర్పడాల్సి వచ్చింది.. టిడిపి, నితీష్ కుమార్ పార్టీల సహకారం తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి ఇబ్బంది లేకపోయినప్పటికీ.. ఒక రకమైన ఒత్తిడి బిజెపిలో ఉంది.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి కొన్ని రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో విజయం సాధించింది. ఆశించిన స్థాయి కంటే ఎక్కువ ఫలితాలను అక్కడ సాధించడంతో బిజెపి ఫుల్ ఖుషి లో ఉంది. మూడో పర్యాయం అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి అనేక నిర్ణయాలు తీసుకుంది. ఇంకా సంచలన నిర్ణయాలు ఉంటాయని బిజెపి చెబుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిజెపి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తోంది. మధ్య ఆసియా ప్రాంతంలో జరిగిన యుద్ధంలో పోషించిన పాత్ర.. చమురు ధరలు.. ఈ విషయాల మీద పదేపదే కాంగ్రెస్ బిజెపిని విమర్శిస్తోంది.
ఇన్ని ఒత్తిళ్ళ మధ్య బిజెపి నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలను ఎదుర్కొంది.. ఈ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఇందులో పాల్గొన్నారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో అస్సాంలో అధికార పార్టీగా బిజెపి ఉంది. ఇక్కడ అధికారాన్ని దక్కించుకుంటామని.. హ్యాట్రిక్ సాధిస్తామని బిజెపి అంచనా వేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయాన్ని వెల్లడించాయి. అస్సాం రాష్ట్రంలో 126 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.. ఇక్కడ 64 సీట్లు లభిస్తే అధికారాన్ని సొంతం చేసుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం ఇక్కడ బిజెపి దాదాపు 100కు పైగా సీట్లు సాధిస్తుందని అంచనా వేశాయి. ఈ రాష్ట్రం మీద కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అంచనాలు లేవు. కాబట్టి ఇక్కడ బిజెపి హ్యాట్రిక్ సాధించడం ఖాయం.
పశ్చిమ బెంగాల్ విషయంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు స్పష్టమైన అంచనాను వెల్లడించలేకపోయాయి. కాకపోతే కొన్ని సంస్థలు బిజెపి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. ఇంకొన్ని సంస్థలు అధికార పార్టీ మరోసారి పగ్గాలు చేపడుతుందని వెల్లడించాయి. బెంగాల్ రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 148 స్థానాలలో గెలుపును అందుకుంటే కచ్చితంగా అధికారాన్ని దక్కించుకోవచ్చు. అధికారం సొంతం చేసుకునే విషయంలో అటు బిజెపి.. ఇటు టిఎంసి పోటా పోటీగా ప్రకటనలు చేస్తున్నాయి.
దక్షిణాదిలో కీలకమైన తమిళనాడు రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు త్రిముకంగా జరిగాయి. ఈసారి కూడా అధికారం దక్కించుకుంటామని డీఎంకే.. ఎలాగైనా సరే అధికారంలోకి వస్తామని అన్న డీఎంకే కూటమి.. రాజకీయాలలో మార్పు చూపిస్తామని టీవీకే ప్రకటనలు చేస్తున్నాయి. తమిళనాడు రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో 118 స్థానాలు సాధిస్తే అధికారాన్ని సొంతం చేసుకున్నట్టే. ఎగ్జిట్ పోల్స్ ఏవి కూడా తమిళనాడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఫలితాలను ఇవ్వలేదు. అలాంటప్పుడు తమిళనాడులో ఈసారి కూడా అధికారానికి ఎన్డీఏ కూటమి దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే తమిళనాడులో కూడా తమకు అనుకూలమైన ఫలితాలు వస్తాయని ఎన్డీఏ కూటమి చెబుతోంది .
కేరళ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా తమకు అనుకూలమైన ఫలితాలు వస్తాయని బిజెపి చెబుతోంది.. బిజెపికి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు అంతగా లేదు. ఇటీవల స్థానిక ఎన్నికల్లో కాస్త సత్తా చూపించినప్పటికీ.. అది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిబింబించే అవకాశం లేదని తెలుస్తోంది. కేరళ రాష్ట్రంలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 71 స్థానాలలో విజయం దక్కించుకుంటే అధికారం సొంతం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ బిజెపికి అంతస్కోప్ ఉన్నట్టు కనిపించడం లేదు.
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం కూడా 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈసారి ఇక్కడ బిజెపి అధికారంలోకి వస్తుందని అంచనాలు వినిపిస్తున్నాయి. బిజెపి కూడా ఈ ప్రాంతం మీద గట్టి నమ్మకంతో ఉంది. 30 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 16 స్థానాల్లో గెలుపును దక్కించుకుంటే అధికారం సొంతం చేసుకోవచ్చు. మొత్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల్లో తమకు అన్ని తీపి వార్తలే వస్తాయని బిజెపి నమ్ముతోంది.