Pratibha Bharati: ఏపీ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి వైసీపీ గూటికి చేరనున్నారా? ఆమెను అధికార పార్టీలోకి చేర్చేందుకు తెర వెనుక మంత్రాంగం జరుగుతోందా? ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేశారా? ఈ విషయం చంద్రబాబుకు తెలిసినా పట్టించుకోలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రతిభాభారతి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె కుమార్తె గ్రీష్మప్రసాద్ కోసం ప్రతిభాభారతి యాక్టివ్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. చివరిసారిగా 2014 ఎన్నికల్లో రాజాం నియోజకవర్గం నుంచి పోటీచేసినా ప్రతిభాభారతికి ఓటమి ఎదురైంది. కానీ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆమె ఎమ్మెల్సీ పదవిని సొంతం చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆమెను పక్కనపెట్టి కాంగ్రెస్ నుంచి వచ్చిన కోండ్రు మురళీమోహన్ కు చంద్రబాబు టిక్కెట్ ఇచ్చారు. కానీ ఆయన సైతం ఓటమి చవిచూశారు. అయితే అప్పటి నుంచి ప్రతిభా కుమార్తె గ్రీష్మ చంద్రబాబును అభ్యర్థిస్తునే ఉన్నారు. కానీ గత ఆరు ఏళ్లుగా ఆయన ఎటూ తేల్చడం లేదు.
సుదీర్ఘ రాజకీయ నేపథ్యం..
ప్రతిభాభారతిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఉమ్మడి ఏపీ తొలి మహిళా స్పీకర్ గా ఆమె గుర్తింపు సాధించారు. ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం ఎచ్చెర్ల నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009 లో నియోజకవర్గాల పునర్విభజనతో ఎచ్చెర్ల బీసీగా మారింది. బీసీ స్థానమైన రాజాం ఎస్సీలకు కేటాయించారు. దీంతో ప్రతిభాభారతి నియోజకవర్గం మారడం అనివార్యంగా మారింది. 2009లో రాజాం నుంచి పోటీచేసిన ప్రతిభాపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కోండ్రు మురళీమోహన్ విజయం సాధించారు. మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్నారు. 2014లో పోటీకి దిగినా ప్రతిభాకు ఓటమి తప్పలేదు. దీంతో 2019లో ఆమెను తప్పించి చంద్రబాబు కోండ్రుకు అవకాశమిచ్చారు. 2024లో పోటీకి కోండ్రు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కుమార్తెకు లైఫ్ ఇవ్వాలని,..
అయితే తనకు ఒక చాన్స్ అంటూ ప్రతిభా కుమార్తె గ్రీష్మ గత ఆరేళ్లుగా చంద్రబాబును కోరుతూ వస్తున్నారు. కానీ ఆయన మనసులో ఉన్న మాటను మాత్రం బయటపెట్టడం లేదు. మరోవైపు కోండ్రు మురళీమోహన్ పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ప్రతిభాతో పాటు కుమార్తె గ్రీష్మ పునరాలోచనలో పడ్డారు. అదే సమయంలో నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులపై వ్యతిరేకత ఉంది. దానిని ప్రతిభా కుటుంబంతో పూడ్చుకోవాలని వైసీపీ చూస్తోంది. ప్రతిభాకు ఎమ్మెల్సీ పదవితో పాటు కుమార్తె గ్రీష్మకు నామినేటెడ్ పదవి కేటాయించనున్నారన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. 2014 ఎన్నికల్లో ప్రతిభా ఓడిపోయినా.. పార్టీ అధికారంలోకి వచ్చేసరికి ఎమ్మెల్సీ సీటు కేటాయించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతిభాకు గుర్తింపు ఇచ్చే చాన్స్ ఉంది. అటువంటప్పుడు పార్టీ మారడం దండగేనని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
గతంలో వర్గాలను అధిగమించి
ప్రతిభాభారతి ప్రస్తుత పరిస్థితికి టీడీపీలో ఉన్న గ్రూపు రాజకీయాలే కారణమన్న కామెంట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎస్సీ మహిళగా ఉన్న ఆమె టీడీపీ మంచి గుర్తింపును ఇచ్చింది. అయితే అది మిగతా నాయకులకు మింగుడుపడలేదు. టీడీపీలో కళా వెంకటరావు, ఎర్రన్నాయుడు మధ్య వర్గ విభేదాలు కొనసాగేవి. మధ్యలో ప్రతిభాభారతి తటస్థ వర్గాన్ని మెంటెయిన్ చేసేవారు. దీంతో మంత్రి వర్గ సమీకరణలు, పార్టీ పదవులు ఇచ్చేటప్పుడు ప్రతిభాను ఇరువర్గాలను అడ్డుకునేవి. కానీ వాటన్నింటినీ అధిగమించి మంత్రి, స్పీకర్ వంటి పదవులను ప్రతిభా సొంతం చేసుకున్నారు. కానీ 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ప్రతిభా రాజకీయ జీవితం తెరపడింది. ఎచ్చెర్ల నియోజకవర్గంపై ఎక్కువగా పట్టుండేది. అందుకే పని గట్టుకొని ఎస్సీ రిజర్వ్ స్థానమైన ఎచ్చెర్లను బీసీ చేశారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. అప్పటి నుంచి ప్రతిభా చేస్తున్న రాజకీయాలేవీ ఫలించలేదు. కుమార్తెకు సైతం లైన్ క్లీయరెన్స్ చేయలేకపోయారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More