రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే అని అంటారు. అంటే.. వారు తీసుకునే నిర్ణయాలే వారిని ముంచడమా? తేల్చడమా? అన్నది నిర్దేశిస్తాయి. ఇప్పుడు కర్నాటక బీజేపీలో కొందరు నేతలకు ఈ సామెత సరిగ్గా సరిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. వారి నిర్ణయమే.. వారి రాజకీయ జీవితాన్ని ప్రమాదంలో పడేశాయనే చర్చ సాగుతోంది. అదే సమయంలో ప్రత్యర్థులు మాత్రం మోసం చేసినందుకు తగిన శాస్తి జరిగిందని అంటున్నారు. మరి, వారెవరు? వారు చేసిన మోసం ఏంటీ? వారికి జరిగిన శాస్తి ఏంటీ? అన్నది చూద్దాం.
బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ ప్రభుత్వం కూలిపోవడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అన్న సంగతి కూడా తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో గెలిచి, బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో.. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే.. ఇలా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన బ్యాచ్ దాదాపు పద్నాలుగు మంది వరకు ఉంది. ఇప్పుడు వీరి భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది.
వీరంతా ముఖ్యమంత్రి యడ్యూరప్ప హామీలతోనే బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే.. ఇప్పుడు ఉన్నట్టుండి యెడ్డీ రాజీనామా చేశారు. ఆయనపై ఉన్న అభియోగాలకు తోడు.. వయసు కూడా ఓ కారణమని చెబుతూ పక్కన పెట్టేసింది అధిష్టానం. యడ్యూరప్ప వయసు 80కి దగ్గర్లో ఉంది. అంటే.. ఈ లెక్కన ఆయన రాజకీయ జీవితానికి పుల్ స్టాప్ పెట్టినట్టే భావించాల్సి ఉంటుంది. మొత్తానికి ఆయన దారిన ఆయన వెళ్లిపోయారు. మరి, యెడ్డీని నమ్ముకొని వచ్చిన బ్యాచ్ సంగతేంటన్నదే ఇప్పుడు ప్రశ్న.
వీరు నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చినవారు. అటు బీజేపీ అధిష్టానంతో వీళ్లకు పెద్దగా పరిచయాల్లేవ్. రాష్ట్రంలో పార్టీపై పట్టు కూడా లేదు. దీంతో.. వీరికి పార్టీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందన్నది ఎవ్వరికీ అర్థంకాకుండా ఉంది. కొత్త ముఖ్యమంత్రి బొమ్మై కేబినెట్లో ఈ వలస పక్షులకు ఎలాంటి ప్రాతినిథ్యం దక్కబోతోందన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది. అయితే.. మెజారిటీ అభిప్రాయం ప్రకారం పార్టీకోసం పనిచేసిన వారికే అధిష్టానం ప్రయారిటీ ఇస్తుందని చెబుతున్నారు. ఈ లెక్కన వీరి గతి అంతేనని అంటున్నారు. అటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం.. పార్టీని మోసగించి వెళ్లినందుకు తగిన శాస్తి జరిగిందని అంటున్నాయి.