
AP Budget 2023: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.2.79 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టడం వెనుక సార్వత్రిక ఎన్నికల లక్ష్యం ఉందన్న చర్చ జరుగుతుంది. ఈ ఏడాది మొత్తం తాయిలాల పంపిణీ కేంద్రంగానే ఈ బడ్జెట్ పెట్టారన్న చర్చ జరుగుతోంది.
ఆర్థిక మంత్రి బొగ్గున రాజేంద్రనాథ్ రెడ్డి 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను గురువారం ప్రవేశపెట్టారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నడూ లేనంత స్థాయిలో రూ.2.79 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇందులో ఎప్పటిలాగే విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
రూ.2.79 లక్షల కోట్లతో బడ్జెట్..
ఏపీలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి వైసీపీ సర్కార్ రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ఈ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో గతంలో లాగానే పలు కీలక రంగాలకు కేటాయింపులు భారీగా చేశారు. ఇందులో విద్య, వైద్య, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యం కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నవరత్నాల పథకాలకు భారీ కేటాయింపులు చేశారు. గతంతో పోలిస్తే ప్రతి శాఖకు కేటాయింపులను పెంచారు.
సంక్షేమానికి ప్రాధాన్యం..
2023 – 24 బడ్జెట్లో కేటాయింపులు చూస్తే వైయస్సార్ పెన్షన్ కానుకకు రూ. 21,434.72 కోట్లు, వైయస్సార్ రైతు భరోసా కు రూ.4,020 కోట్లు, జగనన్న విద్యా దీవెనకు రూ.2,841.64 కోట్లు, జగనన్న వసతి దీవెనకు రూ.2,200 కోట్లు, వైయస్సార్ పీఎం భీమా యోజనకు రూ.1600 కోట్లు, డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు కోసం వేయి కోట్లు, రైతులకు వడ్డీ లేని రుణాలు కోసం రూ.500 కోట్లు కేటాయించారు. వైయస్సార్ కాపు నేస్తానికి రూ. 550 కోట్లు జగనన్న చేదోడుకు రూ. 350 కోట్లు, వైయస్సార్ వాహన మిత్ర కు రూ.275 కోట్లు, వైయస్సార్ నేతన్న నేస్తముకు రూ.200 కోట్లు, వైయస్సార్ మత్స్య భరోసా కు రూ.125 కోట్లు, మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీకి రూ. 50 కోట్లు, రైతు కుటుంబాల పరిహారం కోసం రూ.20 కోట్లు, లా నేస్తం కోసం రూ.17 కోట్లు, జగనన్న తోడుకు రూ.35 కోట్లు, ఈ బీసీ నేస్తం రూ. 610 కోట్లు, వైయస్సార్ కళ్యాణమస్తు పథకానికి రూ.200 కోట్లు, వైయస్సార్ ఆసరాకు రూ. 6700 కోట్లు, వైయస్సార్ చేయూతకు రూ.5000 కోట్లు, అమ్మబడికి రూ.6500 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన మొత్తంగా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలకు రూ.54,228.36 కోట్లు కేటాయించినట్లు అయింది.

కీలక రంగాలకు భారీగా కేటాయింపులు..
ధరల స్థిరీకరణ నిధికి మూడు వేల కోట్లు, వ్యవసాయ యాంత్రికరణకు రూ.1,212 కోట్లు, వైద్యం, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు కేటాయించారు. అలాగే, స్కూల్స్ నాడు – నేడు కోసం రూ.3,500 కోట్లు, జగనన్న విద్యా కానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు, పురపాలక, పట్టణాభివృద్ధి కి రూ.9,381 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కు రూ.1166 కోట్లు, యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖకు రూ.1291 కోట్ల, షెడ్యూల్ కులాల కంపోనెంట్ కోసం రూ.20,005 కోట్లు, షెడ్యూల్ తెగల కాంపోనెంట్ కోసం రూ.6,929 కోట్లు కేటాయించారు. వెనుకబడిన తరగతుల కాంపోనెంట్ కింద రూ.38,605 కోట్లు, కాపు సంక్షేమం కోసం రూ.4,887 కోట్లు, మైనార్టీల సంక్షేమం కోసం రూ.4203 కోట్లు, పేదలందరికీ ఇల్లు కోసం రూ.5600 కోట్లు, పరిశ్రమలు వాణిజ్యానికి రూ.2,602 కోట్లు, రోడ్లు భవనాల శాఖకు రూ.9118 కోట్లు, నీటి వనరుల అభివృద్ధి శాఖకు రూ.11,908 కోట్లు కేటాయించారు. పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖకు రూ.685 కోట్లు, ఎనర్జీ శాఖకు రూ, 6,456 కోట్లు, గ్రామ వార్డు సచివాలయ శాఖకు రూ.3,858 కోట్లు, గడప, గడపకు మన ప్రభుత్వానికి రూ.532 కోట్లు కేటాయించారు.