Homeజాతీయ వార్తలుయడ్యూరప్ప రాజీనామా.. వెనుక ఏం జరిగింది..?

యడ్యూరప్ప రాజీనామా.. వెనుక ఏం జరిగింది..?

అనుకున్నట్లుగానే కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. గత కొంత కాలంగా ఆయన రాజీనామాపై వస్తున్నఉత్కంఠకు ఆయనే తెర దించారు. పార్టీ నిబంధనల మేరకు వయసు మీరిన రీత్యా ఆయన సీఎం సీట్లో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గవర్నర్ ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించనున్నారు. ఇంతకాలం తనపై నమ్మకముంచి సీఎంగా అవకాశమిచ్చిన ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దీంతో కర్ణటక పీఠంపై ఎవరు కూర్చోంటరనన్న ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకొంది.

75 ఏళ్లు నిండిన వారు అధికారంలో ఉండొద్దనే నిబంధన బీజేపీలో ఉంది. వారంతా తమ పదవుల నంచి స్వచ్చందంగా వైదొలగాలి. అయితే ఈ నిబంధనపై యడ్యూరప్ప మల్లగుల్లాలు పడ్డారు. హైకమాండ్ ఆదేశిస్తే ముఖ్యమంత్రి సీట్లో కొనసాగుతానని ప్రకటించారు. కానీ ఆయన అనుకున్నట్లు పార్టీ అధిష్టానం నిబంధనలను పక్కనబెట్టలేదు. రూల్స్ పాటించాల్సిందేనన్నట్లు ఉండడంతో ఆయన స్వచ్ఛంధంగా పదవి నుంచి వైదొలిగారు.

నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి యడ్యూరప్ప వయసు 76 ఏళ్లు. కానీ పార్టీ ఆయనకు రెండేళ్లు అవకాశం ఇచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యడ్యూరప్ప మాట్లాడారు. 75 ఏళ్ల నిబంధనను తాను గౌరవిస్తానన్నారు. ఇన్నేళ్లు కర్ణాటక అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశానని అందుకు తనకు పార్టీ రెండేళ్లు అవకాశం ఇచ్చిందన్నారు. ఈ రేండేళ్లు కోవిడ్ తో పోరాటం చేశామన్నారు. వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తానన్నారు. కానీ కర్ణాటక అభివృద్ధి కోసం తాను రాష్ట్రాన్ని విడిచి వెళ్లలేదన్నారు.

2019 జూలై 26న ప్రమాణ స్వీకారం చేసిన ఆయన అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకంగా మారారు. 17 మంది ఎమ్మెల్యేల అండతో సీఎం సీట్లో కూర్చున్నారు. అయితే తనకు మద్దతు ఇచ్చిన వారే ఇప్పుడు వ్యతిరేకంగా మారారన్న ప్రచారం సాగుతోంది. అయితే పార్టీ కోసం ఎన్నాళ్ల నుంచో పనిచేస్తున్న వారికి సరైన న్యాయం చేయలేదని, మంత్రి వర్గంలో చోటు కల్పించడంలో ప్రాధాన్యం ఇవ్వలేదని కొంతమంది ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

దీంతో సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు ఎగురవేశారని తెలుస్తోంది. తన అండదండలతో ఎదిగిన వారే తనకు బద్ధ శత్రువులుగా మారారు. యడ్డి కుమారుడు విజయేంద్ర అక్రమాలను అడ్డుకోలేకపోవడంతో పార్టీ పటిష్టతకు చెడ్డపేరు వస్తుందని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధిష్టానం ఇవన్నీ విషయాలను పరిగణలోకి తీసుకొని ఆయనకు పరోక్షంగా తప్పుకోమన్నట్లు సంకేతాలిచ్చింది. దీంతో ఆయన సోమవారం రాజీనామా చేయనున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular