
దేశం రెండవ విడత లక్ డౌన్ లోకి వెళ్లడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. దేవాలయాల్లో దర్శనం, ఇతర సేవలకు అవకాశం లేదు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కేవలం అర్చకులు మాత్రమే రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మార్చి 13 నుండి మే 31వ తేదీ వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లించాలని టీటీడీ నిర్ణయించింది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న లాక్డౌన్ నిర్ణయం కారణంగా శ్రీవారి ఆలయంలో మే 3వ తేదీ వరకు భక్తులకు దర్శనం నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా, ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో మార్చి 13 నుండి మే 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారాగానీ, పోస్టాఫీసుల ద్వారా గానీ శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఆ మొత్తాన్ని రీఫండ్ చేసేందుకు టిటిడి చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆర్జిత సేవలను గానీ, దర్శన టికెట్లను గానీ బుక్ చేసుకున్న భక్తులు సంబంధిత టికెట్ వివరాలతోపాటు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ వివరాలను helpdesk@tirumala.org మెయిల్ ఐడికి పంపాలని టిటిడి కోరుతోంది. ఐటి విభాగం ఆధ్వర్యంలో ఈ వివరాల ఖచ్చితత్వాన్ని పరిశీలించిన అనంతరం రీఫండ్ మొత్తాన్ని నేరుగా భక్తుల ఖాతాల్లోకి జమ చేస్తామని టిటిడి అధికారులు తెలిపారు.