అదేందో కానీ తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖను ఎవరు నిర్వహించినా సరే వారి పోస్టు ఊడిపోవడమో.. మరోసారి చాన్స్ రాకపోవడమో జరుగుతోంది. తెలంగాణ తొలి ప్రభుత్వంలో వరంగల్ కు చెందిన రాజయ్య డిప్యూటీ సీఎంగా వైద్యఆరోగ్యశాఖను నిర్వహించారు.
కానీ అతికొద్ది కాలంలోనే ఆయనపై పలు ఆరోపణలు రావడం.. వ్యవహార శైలి కారణంగా కేబినెట్ నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేసిన పరిస్థితి కనిపించింది.
ఆ తర్వాత వైద్యఆరోగ్యశాఖను మహబూబ్ నగర్ కు చెందిన లక్ష్మారెడ్డికి అప్పగించారు. ఆయన బ్యాడ్ లక్ ఏంటంటే.. ఆ శాఖ చూశాక తెలంగాణ రెండో ప్రభుత్వంలో అసలు లక్ష్మారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కలేదు.
ఇక రెండో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటల రాజేందర్ కు ఈ వైద్యఆరోగ్యశాఖను కేసీఆర్ అప్పగించారు. తొలి ప్రభుత్వంలో ఆర్థిక శాఖ చూసిన ఈటలకు ఈ మార్పు శరాఘాతంగా మారింది. రెండో ప్రభుత్వం ఏర్పడ్డాక ఆలస్యంగా కేసీఆర్ మంత్రి పదవులు భర్తీ చేశారు. తర్వాత మొదటి వేవ్, రెండో వేవ్ తో ఈటల అష్టకష్టాలు పడుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ కరోనా కల్లోలంతో కత్తిమీద సాములా మారింది. అయినా కష్టపడ్డ ఈటలకు ఫలితం దక్కలేదు.
తాజాగా భూకబ్జా ఆరోపణలతో ఆ శాఖను కేసీఆర్.. ఈటెల నుంచి తీసేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ నేతలకు అచ్చిరాదని.. అది తీసుకుంటే ఇక రాజకీయంగా కష్టాలు తప్పదని.. పోస్ట్ ఊస్ట్ అవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇక కొత్త వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా మళ్లీ లక్ష్మారెడ్డి పేరుయే వినిపిస్తోంది. ఈ మేరకు ప్రగతి భవన్ నుంచి ఆయనకు కాల్ వెళ్లిందని.. ఈటల స్థానంలో ఆయననే మంత్రివర్గంలోకి కేసీఆర్ తీసుకోబోతున్నారని సమాచారం. మరి ఈ కష్టమైన మంత్రి పదవిని లక్ష్మారెడ్డి తీసుకుంటారా? లేదా అన్నది వేచిచూడాలి.