Rahul Gandhi: కర్ణాటకలో విజయం సాధించింది. తెలంగాణలో నూ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి అనుకోని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టు పిడుగు పాటు లాంటి తీర్పు ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో నైరాశ్యం అలముకుంది. మరికొద్ది నెలలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
“మోడీ ఇంటిపేరు” కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో ఏమాత్రం ఊరట లభించలేదు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. సూరత్ సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఆయన దోషి అని ఇచ్చిన తీర్పు అమలు నిలిపివేసేందుకు కూడా నిరాకరించింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.
హైకోర్టు నిర్ణయంతో రాహుల్ గాంధీ పై లోక్సభ సభ్యత్వం పై అనర్హత కొనసాగుతుంది. అయినా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తీర్పు రావడంతో ఏఐసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. ఇక ఈ తీర్పు నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ పై ప్రస్తుత కేసు మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర కేసులు కూడా దాఖలయ్యాయని తెలిపింది. వీర్ సావర్కర్ మనవడు దాఖలు చేసిన కేసు అటువంటి వాటిలో కూడా ఒకటని గుర్తు చేసింది. ఆయనపై ఎనిమిది క్రిమినల్ పరువు నష్టం కేసులు నమోదు అయ్యాయని, ఇవన్నీ కూడా విచారణలో ఉన్నాయని పేర్కొన్నది. ఇది ఏమైనాప్పటికీ ఆయనను దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు ఏ విధంగానూ అన్యాయమైనది కాదని న్యాయస్థానం పేర్కొన్నది. ఈ తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఇక 2019లో జరిగిన లోకసభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్ బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఈ వివాదానికి కారణమయ్యాయి. ” దొంగలందరి ఇంటిపేరు మోడీ ఎలా అవుతోంది” అని రాహుల్ ప్రశ్నించడమే దుమారానికి దారితీసింది. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్ రాష్ట్రానికి చెందిన పూర్ణేష్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన దోషి అని కోర్టు 2023 మార్చి 23న తీర్పు చెప్పింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దూషిగా నిర్ధారణ అయిన వ్యక్తి చట్టసభల సభ్యునిగా కొనసాగించేందుకు చట్టం అంగీకరించదు. కాబట్టి ఆయన వయనాడు లోక్సభ సభ్యత్వానికి అనర్హుడని లోక్సభ సచివాలయం మార్చి 24న ప్రకటించింది. ఈ కోర్టు తీర్పు అమలులో నిలుపుదల చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో ఆయన ఏప్రిల్ 25న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. వేసవి సెలవుల తర్వాత తీర్పు చెబుతామని ప్రకటించింది. సెలవుల అనంతరం రాహుల్ గాంధీకి ఎదురు దెబ్బలాంటి తీర్పు ఇచ్చింది. ఇక ఈ తీర్పుతో రాహుల్ గాంధీ మరోసారి వార్తల్లో వ్యక్తి అయిపోయారు.