CM KCR- Early Elections: తెలంగాణలో మరోమారు ముందస్తు ఎన్నికల చర్చ జోరందుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఖాయమనే జోస్యం చెబుతుంటే దాన్ని మిగతా పార్టీలు కూడా ఔననే అంటున్నాయి. వచ్చే ఏడాది మే లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడం జరుగుతుందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. కేసీఆర్ రోజు ఫామ్ హౌస్, ప్రగతి భవన్ లో దీనిపైనే చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ పలు సర్వేలు చేయించుకుని పార్టీ భవితవ్యంపై తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికతో దిమ్మతిరిగిపోయిన కేసీఆర్ తరువాత ఏం చేయాలనే దానిపై డైలమాలో పడుతున్నారు. పార్టీ నేతల తీరు సరిగా లేదని తేలడంతో ఏం చేయాలనే దానిపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం జరుగుతుందని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం అన్ని పార్టీలు రాజకీయ వేడి రాజేస్తున్నాయి. సభలు, సమావేశాలు, నిరసనలు తెలుపుతూ ప్రభుత్వంపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయడమే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లు టీఆర్ఎస్ తీరుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు దఫాలు ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి టీఆర్ఎస్ పై దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ కూడా వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించి ఇంటింటికి దాన్ని చేరవేసే కార్యక్రమంలో భాగంగా రచ్చబండ నిర్వహిస్తోంది.
Also Read: KCR- Modi: ఈసారి కూడా కేసీఆర్ మోడీని కలవడం లేదా?
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ఇదివరకే భావించినా అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించడంతో వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. లేకపోతే ఈ పాటికే ముందస్తు కు వెళ్లే వారని తెలుస్తోంది. బీజేపీ హవా కొనసాగుతుందని భావించి ముందస్తు నిర్ణయాన్ని వాయిదా వేసుకుని జాతీయ రాజకీయాల వైపు చూస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందస్తు ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 మేలో ముందస్తు ఎన్నికలు వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీని కోసం కేసీఆర్ కసరత్తు కూడా చేస్తున్నట్లు చెబుతున్నారు.
రాబోయే ఎన్నికల్లో రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ తమ విధానాలు ప్రకటిస్తోంది. తాము అధికారంలోకి వస్తే రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని, రైతులకు ఎకరాకు రూ. 12 వేల చొప్పున బ్యాంకులో జమ చేస్తామని హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రైతుల కోసం ఏం చెబుతుందో ఇంకా తెలియడం లేదు. రైతులే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించినా వాటి అమలుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉచిత పథకాలతో దేశాన్ని సర్వ నాశనం చేసే విధంగా నేతల తీరు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీలంక లాంటి దేశం సంక్షోభంలో కూరుకుపోవడానికి ఉచిత పథకాలే కారణమని చెబుతున్నా మన వారు మాత్రం వినిపించుకోవడం లేదు.
సీఎం కేసీఆర్ దోచుకున్న దాన్ని పైసా తో సహా కక్కిస్తామని బీజేపీ ఇదివరకే ప్రకటించినా దాని అమలు చేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీ, కాంగ్రెస్ ఇంకా ఏం నిర్ణయాలు తీసుకుంటాయో తెలియడం లేదు. మొత్తానికి రాష్ట్రంలో టీఆర్ఎస్ ను మట్టికరిపించే పథకంలో భాగంగా రెండు జాతీయ పార్టీలు బలపడేందుకే ప్రయత్నిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే మరి.
Also Read:CM Jagan- London Mystery: వీడని లండన్ మిస్టరీ..ఆ 24 గంటలు సీఎం జగన్ ఎక్కడకు వెళ్లినట్టు?
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More