దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా క్రమంగా తగ్గుతోందని అమెరికాకు చెందిన డేటా ఇంటలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ చెబుతోంది. 2019 నాటితో పోలిస్తే మోడీకి ఉన్న జనామోదం 20 పాయింట్ల మేర తగ్గినట్లు వెల్లడించింది. ఆగస్టు 2019లో మోడీకి 82 శాతం ఉండగా ఇప్పుడు 66 శాతానికి పడిపోయినట్లు అంచనా. జమ్ముకాశ్మీర్ విభజన, ఆర్టికల్370 రద్దు సమయంలో మోడీ నాయకత్వానికి ఎక్కువ జనామోదం లభించగా ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆయన ఇమేజ్ గ్రాఫ్ పడిపోవడం తెలిసిందే.
భారత్ లో మోడీ నాయకత్వానికి జనామోదం తగ్గినప్పటికి ప్రపంచవ్యాప్తంగా13 దేశాల అధినేతలకు ఉన్న ఆదరణతో పోలిస్తే మోడీనే ముందు వరుసలో ఉండడం విశేషం. 66 శాతం జనామోదంతో మోడీ టాప్ లో ఉండగా ఏంజెలా మెర్కెల్ (జర్మనీ 53 శాతం), జస్టిస్ ట్రడో (కెనడా 48 శాతం), బోరిస్ జాన్సన్ (యూకే 36 శాతం), మూన్ జె ఇన్(దక్షిణ కొరియా 37 శాతం), పెర్డో సాంచెజ్ (స్పెయిన్ 36 శాతం), ఇమాన్యుయెల్ మాక్టోన్ (ఫ్రాన్స్ 35 శాతం), యోసఇడే సుగా (జపాన్ 29 శాతం), మార్లో ద్రగి(ఇటలీ 65 శాతం), లోపెజ్ ఒబ్రేడార్ (మెక్సికో 63 శాతం), స్కాట్ మారిసన్ (ఆస్ర్టేలియా 54 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నారు.
భారత్ లో దాదాపు 2216 మంది అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే నిర్వహించినట్లు మార్నింగ్ కన్సల్డ్ వెల్లడించింది. ప్రస్తుతం మోడీకి 66 శాతం జనామోదం ఉండగా 28 శాతం మంది ఆయన నాయకత్వాన్ని తిరస్కరించారని వెల్లడించింది. గురువారం జూన్ 26న ఈ ఫలితాలు తమ వెబ్ సైట్ లో అప్ డేట్ చేసింది. మార్నింగ్ కన్సల్డ్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎన్నికల సర్వేలు నిర్వహిస్తుంటుంది. దీని అనుబంధ సంస్థ పొలిటికల్ ఇంటలిజెన్స్ యూనిట్ నుంచి రియల్ టైమ్ పోలింగ్ డేటాను సేకరించి విశ్లేషిస్తుంది.
భారత్ లో కరోనా రెండో దశను ఎదుర్కోవడంలో ప్రధాని మోడీ నాయకత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. మోడీ ముందుచూపుతోనే వ్యవహరించకపోవడం వల్లే సెకండ్ వేవ్ లో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మొదటి దశ నుంచి గుణపాఠం నేర్వకపోవడంతోనే దేశ జనాభాకు సరిపడ వ్యాక్సిన్లు కొనుగోలు చేయకపోవడం కూడా మోడీ ఇమేజ్ తగ్గించిందని తెలుస్తోంది.