Homeఆంధ్రప్రదేశ్‌వ్యాక్సిన్లు మావి.. ప్రచారం నీదా జగన్: సోమువీర్రాజు

వ్యాక్సిన్లు మావి.. ప్రచారం నీదా జగన్: సోమువీర్రాజు

ఏపీ సీఎం జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. వ్యాక్సినేషన్ లో జగన్ వక్రబుద్ది చూపారని కడిగేశారు. వ్యాక్సిన్లు కేంద్రానివి.. ప్రచారం మాత్రం జగన్ దా? అని నిలదీశారు. యోగా డే రోజున స్పెషల్ డ్రైవ్ పెట్టమంటే ముందురోజే పెట్టేస్తారా? అని ఎండగట్టారు. 9.56 లక్షల వ్యాక్సిన్లు పంపితే 90 శాతం ముందే వాడేస్తారా? అని ప్రశ్నించారు. ప్రధాని మాటలను తిరస్కరిస్తారా? అని మండిపడ్డారు.

రాష్ట్రంలో వాక్సినేషన్ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వక్రబుద్ది మరో సారి బయటపడిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం 9.56 లక్షల వ్యాక్సిన్లు పంపితే వాటిని ముందురోజే వాడేసిన సీఎం వైఖరిపై బీజేపీ నిరసన తెలిపింది. యువతకు ఎందుకు వ్యాక్సిన్ వేయలేదని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా వ్యాక్సిన్లు తీసుకుని తామేదో ఘనకార్యం సాధించినట్లు ప్రచారం చేసుకోవడాన్ని బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తప్పుపట్టారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలోని వ్యాక్సినేషన్ సెంటర్లను సోమువీర్రాజు నాయకత్వం లో పార్టీ నాయకబృందం సందర్శించింది. అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ 21న దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు పెద్దసంఖ్యలో వ్యాక్సిన్లు పంపారు. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నాయకులు ఆయా కేంద్రాలను సందర్శించాలని పార్టీ ఆదేశించింది.

ఈ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు, విశాఖపట్నం నగరంలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను పరిశీలించారు. కానీ అన్ని కేంద్రాల్లో వ్యాక్సినేషన్ స్వల్ప సంఖ్యలోనే జరిగింది. ఎక్కడికెళ్లినా వ్యాక్సిన్ లేదని, ఆదివారం రోజునే ఎక్కువ వేశామని, ఈరోజు కొద్దిగా మిగిలినవి మాత్రం వేశామని అధికారులు చెప్పారు.దీనిపై పార్టీ అధ్యక్షులు సోమువీర్రాజు ఆశ్చర్యంతో ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.

ప్రధాని మోదీ ఆలోచనలను ముఖ్యమంత్రి జగన్ పాటించడం లేదని ధ్వజమెత్తారు. కేంద్రం ముందు ఒకలా, రాష్ట్రంలో ఒకలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. 9.56 లక్షల వ్యాక్సిన్లు ఉచితంగా రాష్ట్రానికి పంపి స్పెషల్ డ్రైవ్లో 18 ఏళ్లు పైబడిన వారికి వేయాలని చెబితే ముందురోజే వాటిని వాడేయటం ప్రధాని మాటలను తిరస్కరించడమే అన్నారు. పైగా దేశంలో అందరికంటే తామే ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ వేశామని ప్రచారం చేసుకోవడం వక్రబుద్ధికాదా అని ప్రశ్నించారు. కనీసం ఒక్క వ్యాక్సినేషన్ కేంద్రంలో కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చినా ప్రధాని మోదీ చిత్రం ఏర్పాటుచేయకుండా ముఖ్యమంత్రి జగన్ తన చిత్రాలే ఏర్పాటుచేసుకున్నారని ఇది పద్దతి కాదని విమర్శించారు.

ముఖ్యమంత్రి జగన్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. పంపిన వ్యాక్సిన్లలో కనీసం సగమైనా యువతకు ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. 18 ఏళ్లు దాటిన వారికి ఉచిత వ్యాక్సిన్ చేయడానికి మరో రోజు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.వి.ఎన్. మాధవ్ మాట్లాడుతూ దేశంలోని అన్ని రాష్ట్రప్రభుత్వాలు వ్యాక్సిన్లు కొంటే వైసీపీ, టిఆర్ఎస్ ప్రభుత్వాల వైఖరి వ్యతిరేకంగా ఉందన్నారు. వ్యాక్సిన్లు కొనకుండా తాత్సరం చేస్తుంటే ప్రధాని మోదీ దేశంలోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు వేయ సంకల్పంచారన్నారు. యువత ఎక్కువ మంది పాల్గొనేలా స్పెషల్ డ్రైవ్ ఏర్పాటుచేస్తే దానిని పాటించలేదని విమర్శించారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పర్యటనలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమారరాజు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్, వార్డు కార్పొరేటర్ అప్పారావు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular