Land Registrations : ఏపీ వ్యాప్తంగా భూముల క్రయవిక్రయాల ప్రక్రియ నిలిచిపోయింది. సర్వర్ డౌన్ పేరిట రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. దీంతో క్రయవిక్రయదారులు ఆపసోపాలు పడుతున్నారు. మరో రెండురోజుల్లో భూముల ధరలను పెంచుతున్న నేపథ్యంలో సాంకేతిక సమస్య రావడం విశేషం. గత రెండురోజులుగా సాంకేతిక సమస్య కొనసాగుతోంది. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ప్రజలు బారులు దీరుతున్నారు. సర్వర్ పని చేయకపోవడంతో దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయకుండా అధికారులు పక్కన పెట్టేశారు.
అయితే ఇప్పటికే భూముల ధర పెంపు నిర్ణయం బయటకు వచ్చింది. దీంతో భూ క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్లకు సిద్ధపడ్డారు. పెద్దఎత్తున కార్యాలయాలకు చేరుకున్నారు. కానీ అక్కడ సిబ్బంది సర్వర్ డౌన్ అని చెప్పడంతో పడిగాపులు కాశారు. అయితే నిన్నటి వరకూ అర్బన్ పరిధిలో మాత్రమే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ రోజు అన్ని ప్రాంతాల్లో నిలిపివేశారు. సాంకేతిక సమస్యతో వెబ్ స్తెట్ తెరుచుకోలేదు. రివర్స్ ప్రింట్ రావడం లేదని చెబుతున్నారు. అయితే క్రయ విక్రయదారులు మాత్రం ప్రభుత్వం కావాలనే చేసిందని చెబుతున్నారు.
భూముల ధర పెంచేందుకు జగన్ సర్కారు సిద్ధపడుతోంది. గతేడాది రేట్లు పెంచిన ప్రాంతాల్లో కాకుండా మిగిలిన చోట్ల మాత్రమే పెంచనుంది. ప్రధానంగా డిమాండ్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో రేట్ల పెంపునకు సిద్ధమైంది. దానికి సంబంధించి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ధరలు నిర్థారిస్తూ జాబితా సిద్ధం చేశారు. గతేడాది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఒకసారి మార్కెట్ ధరలను ప్రభుత్వం పెంచింది. 13 జిల్లాలు కాస్తా 26 జిల్లాలుగా మారాయి. అందుకే జిల్లా కేంద్రాలను టార్గెట్ చేసుకుంటూ ప్రభుత్వం భూముల ధరలను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో వేర్వేరుగా పెంచిన ధర ఉండనుంది. 30నుంచి గరిష్టంగా 70 శాతం వరకూ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది.గత ఏడాది భూముల ధర పెంపుతో సుమారు 8 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇప్పుడు దానిని మరింత పెంచాలన్న ఆలోచనలో జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.