పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ లను బదిలీ చేయాలన్న ప్రభుత్వం ప్రతిపాదనలకు ఎస్ఈసీ రమేశ్ కుమర్ అడ్డు చెప్పారు. కీలకంగా వ్యవహరంచాల్సిన ఈ ఇద్దరిని ఎన్నికల ప్రక్రియ మధ్యలో బదిలీ చేయడం వల్ల ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని సీఎస్ కు మంగళవారం లేఖ రాశారు.
ఇద్దరు అధికారుల బదిలీ ప్రతిపాదనను తిరస్కరించిన నిమ్మగడ్డ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ.. ఆదేశాలు జారీ చేశారు. గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారు చేసే విషయంలో వీరు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. అంతే కాకుండా విధి నిర్వహణలో విఫలమయ్యారని, వారి సర్వీసు రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. అయితే సెన్సూర్ కింద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే.. ఒక ఏడాది పాటు పదోన్నతులకు అవకాశం ఉండదని అర్థం చేసుకోవాలని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయమై.. గవర్నర్ తో చర్చించేందుకు నిమ్మగడ్డ సిద్ధమయ్యారు. ఈ మేరకు బుధవారం ఉదయాన్నే.. గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. ఆయనతో చాలా సేపు సమావేశం అయ్యారు. రాష్ర్టంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను గురించి వివరించారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో నెలకొంటున్న సమీకరణాలు.. అధికారుల తీరు.. కొందరు అధికారులపై తీసుకుంటున్న క్రమశిక్షణ చర్యలు.. తదితర అంశాలపై గవర్నర్ తో చర్చించినట్లు సమాచారం.
అయితే ఈ భేటీకి సీఎస్ ఆదిత్యానాథ్ దాస్ కూడా వచ్చినట్లు సమాచారం. గవర్నర్ తో భేటీ అనంతరం గ్రామ పంచాయతీ ఎన్నికలు.. కోవిడ్ వైరస్ నివారణకు వేస్తున్నవ్యాక్సినేషన్ పై రాష్ర్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ బాబుతో కలిసి.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల కలెక్టర్లు.. ఎస్పీలు.. సీఈవోలు.. డీపీవోలు పాల్గొంటారు. ఎన్నికల నేపథ్యంలో తీసుకోవలసిన చర్యలు.. విధి విధాలపై చర్చిస్తారు.