కరోనా మహమ్మారి విజృంభన కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లును పూర్తిగా మూసివేస్తూ కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. అయితే మూతపడిన ఉన్నత విద్యా సంస్థల్లో ఆన్ లైన్ బోధనను మరింత మెరుగుపర్చాలని, విద్యార్థులపై ఒత్తిడి లేకుండా విద్యా బోధన, పరీక్షల నిర్వహణ వంటి చర్యలు చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ సూచించారు. యూనివర్సిటీల్లో ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై ఆమె యూనివర్సిటీల రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ వలంటీర్లు నిర్వహించే రక్తదాన శిబిరాల నిర్వహణను రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయంతో చేపట్టాలన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతకు మెరుగుపెట్టేలా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు. వాటి ద్వారా విద్యార్థుల్లో కొత్త ఆలోచనలు చిగురిస్తాయన్నారు. విద్యార్థులంతా ఆరోగ్యసేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికే ఆన్ లైన్ తరగతులకు డిగ్రీ కోర్సుల్లో ఇప్పటికే 70 నుంచి 80 శాతం సిలబస్ పూర్తి అయిందని, పీజీ కోర్సుల్లో 80 నుంచి 90 శాతం సిలబస్ పూర్తయిందని యూనివర్సిటీల రిజిస్ట్రార్లు వివరించారు. ఇందుకు రిజిస్ట్రార్లను గవర్నర్ అభినందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తర్వాత రెండు మూడు వారాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, వార్షిక పరీక్షల నిర్వహణకు చర్యలు చేపడతామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. డిగ్రీలో ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల డిటెన్షన్ ఎత్తివేతపై ప్రభుత్వ ఆమోదం తీసుకొని ఉత్తర్వులు జారీ చేస్తామని వివరించారు.