Homeఆంధ్రప్రదేశ్‌లాక్ డౌన్: తెలుగు రాష్ట్రాల దాగుడుమూతలు

లాక్ డౌన్: తెలుగు రాష్ట్రాల దాగుడుమూతలు


శత్రువులతో యుద్ధం చేయడానికి కత్తులు కటార్లు అక్కర్లేదని.. కేవలం ఒక కంటికి కనిపించని వైరస్ తో భయపెట్టవచ్చని ఆ చైనావాడు నిరూపించాడు. వాడు తయారు చేశాడో.. స్వతహాగా పుట్టిందో కానీ మొత్తానికి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.

*లాక్ డౌన్ తో ప్రయోజనం ఎంత?
లాక్ డౌన్ నెలరోజులు దాటింది. కరోనా వైరస్ ను దీంతోనే కట్టడి చేయగలమని మోడీ నుంచి మొదలుపెడితే కేసీఆర్, జగన్  వరకూ అందరూ అదే మంత్రమన్నారు. మరి లాక్ డౌన్ సాగుతున్నా నెలరోజులు దాటినా కేసులు ఎందుకు పెరుగుతున్నట్టు? అందరూ ఇంట్లో ఉంటే కేసులు ఆ ఇంట్లోనే వెలుగుచూడాలి కదా.. ఇంత విస్తృతంగా విశృంఖంలంగా బయట వారికి ఎందుకు సోకుతున్నాయి? అంటే లాక్ డౌన్ ఖచ్చితంగా స్టిక్ట్ గా సాగడం లేదని తెలుస్తోంది.  మరి లాక్ డౌన్ మరో నెల పొడిగించినా కూడా కరోనా కేసులు తగ్గుతున్నాయన్న గ్యారెంటీ ఇస్తారా? అంటే అదీ లేదు..  రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. మరి లోపం ఎక్కడ అన్నది అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి..

*ప్రభుత్వాల పనితీరే గీటురాయి..
కరోనా కట్టడి చేయాలన్నా.. లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేయాలన్నా ప్రభుత్వాల పనితీరు ఇందుకు గీటురాయిగా చెప్పవచ్చు.  ప్రస్తుత ప్రభుత్వాలను చూస్తే సీఎం కేసీఆర్ కరోనా ప్రబలినప్పటి నుంచి తన సహజశైలికి భిన్నంగా రోజూ సమీక్షిస్తూ మీడియా ముందుకు వస్తూ తీవ్ర చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఏపీ సీఎం జగన్ ఏకంగా దక్షిణ కొరియా నుంచి ఆధునిక టెస్ట్ కిట్స్ తీసుకొచ్చి పరీక్షిస్తున్నారు. ఏపీలో అస్సలు ఉనికే లేని సమయంలో మర్కజ్ లింకులతో అల్లకల్లోలంగా మారింది. తెలంగాణలోనూ అంతే. మర్కజ్ లింకులు ముగిసినా ఇంకా రెండు తెలుగు రాష్ట్రాల్లో బయటపడుతూనే ఉన్నాయి. ప్రజలను బయటకు రాకుండా కేసీఆర్, జగన్ లు బాగానే పోలీసులతో కంట్రోల్ చేస్తున్నారు. మరి కేసులను ఎందుకు కట్టడి చేయడం లేదన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది.

*నిర్వహణ ఓకే పరీక్షల సంగతేంటి?
కరోనాపై తెలంగాణ సర్కార్ బాగా ఫైట్ చేస్తోంది. గాంధీ ఆసుపత్రి లో చాలా మందికి కంట్రోల్ చేసింది.. మరణాల రేటు తక్కువ చేసింది. కానీ టెస్టులు మాత్రం చేయడం లేదు. సెకండ్ థర్డ్ కాంటాక్టులను క్వారంటైన్ కే తరలిస్తున్నారు. వ్యాధి లక్షణాలు బయటపడ్డ వారికి మాత్రమే చేస్తున్నారు. ఇక ఏపీలో పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నారు. కానీ కరోనా చికిత్స నిర్వహణలో విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య సదుపాయాలు వాటి నిర్వహణ మీద దృష్టిపెడుతున్నారా అన్నది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం..

*కేరళ బెస్ట్.. తెలుగు రాష్ట్రాలు ఎందుకు లేట్?
కరోనా వ్యాపించిన కొత్తలో అందరికంటే ఎక్కువ కేసులు కేరళలో వెలుగుచూశాయి. కానీ అక్కడ కమ్యూనిస్టు సీఎం విజయన్ అంతే తీవ్రస్థాయిలో కట్టడి చేశాడు. కేరళలో కరోనా పాజిటివ్ కేసులు అంతర్జాతీయ వృద్ధిరేటు కన్నా తక్కువగా ఉన్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల కరోనా వృద్ధి రేటు చాలా ఎక్కువగా ఉంది. లోపం ఎక్కడుందని గమనిస్తే.. ప్రయత్నం.. చిత్తశుద్ధి అని క్లియర్ కట్ గా తెలుస్తోంది.

*కేసుల సంఖ్యను దాచేస్తున్నారా?
తెలంగాణలో ఒక వర్గం జనాభా ఎక్కువ. మర్కజ్ లింకులు బోలెడుతున్నాయి. అయితే కేసుల సంఖ్యను తెలంగాణ సర్కార్ దాచేస్తోందన్న సందేహాలు కలుగుతున్నాయి.. ఇక ఏపీలోనూ కేసుల సంఖ్య విషయంలో  సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. టెస్టులు సరిగా చేయకపోవడం.. కొందరు ముందుకు రాకపోవడంతో కేసుల సంఖ్య విషయంలో ప్రభుత్వాలు కూడా తక్కువ చేస్తున్నాయనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.

*క్లారిటీ ఇవ్వాలి.. కట్టడి చేయాలి
ఇప్పటికైనా లాక్ డౌన్ పేరిట జనాలను లాక్ చేయడంతోపాటు కేసుల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే టెస్టులను పెద్ద ఎత్తున చేసి వాటిని వ్యాపింపచేయకుండా చేయాలి. సమర్థవంతంగా కరోనాను కట్టడి చేయాలి. ఏప్రిల్ పోయింది.. వచ్చే మే నెల కూడా పోవడం ఖాయంగా కనిపిస్తోంది. కనీసం జూన్ నెల నుంచి అయినా కరోనా పోయి లాక్ డౌన్ ఎత్తేస్తే జనాలు పనిచేసుకొని బతుకుతారు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టి అందరికీ ఉపాధి కల్పిస్తేనే భవిష్యత్తుకు మనుగడ.. లేదంటే ఆకలి చావులతో అలమటిస్తారు. ఆఫ్టర్ కరోనా ప్రభుత్వాలకు పెద్ద పనే ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు..

–నరేష్ ఎన్నం

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular