Ramoji Rao as A1 and Shailaja as A2
CID Case: మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలపై ఏపీ సీఐడీ కేసు నమోదుచేసింది. గత కొద్దిరోజులుగా జగన్ సర్కారు మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో అక్రమాలపై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మార్గదర్శి మేనేజర్లను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. శనివారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ కార్యాలయాల్లో విస్తృత సోదాలు జరిపారు. చిట్ ఫండ్ సంస్థల్లో ఆర్థిక నేరాలున్నాయంటూ అభియోగాలు మోపుతూ పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. చిట్ ఫండ్స్ చైర్మన్, ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరావు ఏ1, ఆయన కోడలు మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజ ఏ2 లపై 420 చీటింగ్ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. దీంతో ఇది సంచలనంగా మారింది. కేసుల్లో శరవేగంగా పావులు కదుపుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గత ఏడాది నవంబరులో ఏపీ సీఐడీ మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేసింది. దాదాపు అనుబంధ శాఖలన్ని సమన్వయంతో కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో పాటు రెవెన్యూ, ఇంటెలిజెన్స్ టీమ్ లు సోదాలు జరిగాయి. ఇందులో కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నాయి. 1982 చిట్ ఫండ్ చట్టానికి విరుద్ధంగా లావాదేవీలు నడిచినట్టు దర్యాప్తులో తేలినట్టు వార్తలు వచ్చాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మార్గదర్శి తమ ఖాతాదారుల సొమ్మును ఎలా అక్రమంగా ఇతర అకౌంట్లకు తరలించిందో బయటపడిందని ప్రచారం సాగింది. మార్గదర్శిలో చీటీ వేసిన ఖాతాదారులు ఎవరైనా అవసరాల నిమిత్తం చీటీ పాడితే.. వెంటనే సొమ్ములు చెల్లించడం లేదని తేలింది.. ష్యూరిటీలు, బ్యాంక్ గ్యారంటీలు అని చెబుతూ చీటీ పాడిన మూడు నెలల తర్వాత ఖాతాదారుడికి చెల్లిస్తున్నట్టు గుర్తించారు. వీటిన్నింటిపై సమగ్ర నివేదికను రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు
అయితే తాజాగా విచారణ, కేసుల నమోదు పక్కా ప్రణాళికతో కొనసాగాయి. ఈ నెల 10న విజయవాడలోని అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ వీఎస్ఎస్ కృష్ణారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేసినట్టు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. అయితే ఎక్కడికక్కడే పక్కా వ్యూహంతో సీఐడీ అధికారులు వ్యవహరించారు. కొన్నిచోట్ల సిబ్బంది వారించినా బలవంతంగా కార్యాలయాలు తెరిపించి సోదాలు చేశారు. కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలోని శ్రీనివాసరావు అనే మేనేజర్ కు కనీసం నోటీసులు ఇవ్వకుండా తరలించడంపై కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా అధికారులు వెనక్కి తగ్గలేదు. అంతే దూకుడుగా వ్యవహరించారు. ఈయన పేరును ఏ3గా కేసులో చేర్చారు.
ఏపీలో ఈనాడు దూకుడును కట్టడి చేసేందుకే మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై కేసులని తెలుస్తోంది. ఒక వైపు వివేకా హత్య కేసు, మరోవైపు రాజకీయ ప్రతికూలాంశాలు జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామోజీరావు ఈనాడు దూకుడు మీద వ్యవహరిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక కథనాలను పతాక శీర్షికల్లో ప్రచురిస్తోంది. అందుకే జగన్ కలరవపాటుకు గురవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తనను అడ్డుకునేందుకు దుష్టచతుష్టయం కలిసి వస్తోందని చెబుతున్నారు. అందులో రామోజీరావు పాత్ర కీలకమైనదని ఆరోపిస్తున్నారు. ఆయన్ను కట్టడి చేసే పనిలో భాగంగానే సీఐడీ ని ఉసిగొలిపినట్టు విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.