Homeఆంధ్రప్రదేశ్‌AP Political Alliance: అధికారం చెరిసగం.. తెరపైకి 50:50 ఫార్ములా

AP Political Alliance: అధికారం చెరిసగం.. తెరపైకి 50:50 ఫార్ములా

AP Political Alliance: ఏపీలో పొత్తులపై ఇంతవరకూ స్పష్టత రాకున్నా.. సరికొత్త ప్రతిపాదనలు ముందుకొస్తున్నాయి. ఇంకా పొత్తు పురిటి నొప్పులు దాటకుండానే బిడ్డకు ఏం పేరు పెడతామన్న చందంగా టీడీపీ, జనసేన పార్టీలు వ్యవహరిస్తున్నాయి. పొత్తులు కుదరాలి? ఎవరెవరికి ఎన్ని స్థానాలు? ఏయే జిల్లాల్లో ఏయే స్థానాలు అన్నది తుది రూపానికి రావాలి. ఎన్నికల్లో విజయం సాధించాలి. మెజార్టీ మార్కు దాటాలి. కానీ ‘అలు లేదు..చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం’ మాదిరిగా మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి అంటే.. మా సార్ ముఖ్యమంత్రి అంటూ కీచులాటకు దిగుతున్నారు. సర్పంచ్, ఎంపీపీ వంటి స్థానిక సంస్థల పదవుల పంపకానికి సంబంధించి 50:50 ఫార్ములాను తెరపైకి తెస్తున్నారు. మొద‌టి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత రెండున్న‌ర సంవ‌త్స‌రాలు తెలుగుదేశం పార్టీ చేప‌ట్టాలనే సూచ‌న తెర‌పైకి వ‌స్తోంది. పార్టీ నేత‌లెవ‌రూ 50:50 ఫార్ములాపైకానీ, పొత్తుల‌పైకానీ ఏమీ మాట్లాడ‌వ‌ద్ద‌ని టీడీపీ వారికి అంత‌ర్గ‌తంగా ఆదేశాలందాయి. బీజేపీతో పొత్తు ఉంటుందా? ఉంటే ఆ పార్టీ ష‌ర‌తులేమిటి? పొత్తు లేకుండా జ‌న‌సేన‌, తెలుగుదేశం క‌లిసివెళితే వీరిద్ద‌రి మ‌ధ్య ఉండే ష‌ర‌తులేమిటి అనేవాటిపై స్ప‌ష్ట‌త రావాలంటే కొద్దిరోజులు వేచిచూడ‌క త‌ప్ప‌దు.

AP Political Alliance
somu veerraju, chandrababu, pawan kalyan

అయోమయం..
పవన్ చేసిన పొత్తుల వ్యాఖ్యలతో అటు తిరిగి ఇటు తిరిగి టీడీపీ, జనసేన మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం చెడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్ వ్యాఖ్య‌లు తెలుగుదేశంతోపాటు, జ‌న‌సేన శ్రేణుల‌ను కూడా అయోమ‌యానికి గురిచేశాయి. గ‌త రెండు ఎన్నిక‌ల్లో తాను త‌గ్గానంటూ ఈసారి మాత్రం త‌గ్గేది లేద‌ని వ‌ప‌న్ స్ప‌ష్టం చేయ‌డంతో ఇరుపార్టీల మ‌ధ్య పొత్తుల‌పై సందిగ్ధ‌త నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్‌క‌ల్యాణ్ వ్యాఖ్య‌ల‌తో తెలుగుదేశం పార్టీ ఆలోచ‌న‌లో ప‌డింది. పార్టీ అధికార ప్ర‌తినిధుల‌కు, సీనియ‌ర్ నేత‌ల‌కు దీనిపై ఎటువంటి వ్యాఖ్య‌లు చేయొద్దంటూ అంత‌ర్గ‌తంగా పార్టీ ఆదేశాలు జారీచేసిన‌ట్లు తెలుస్తోంది. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబునాయుడు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌ని, అప్ప‌టివ‌రకు ఎవ‌రూ పొత్తుల‌పై మాట్లాడ‌వ‌ద్ద‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.

AP Political Alliance
tdp, bjp, jana sena

పునరాలోచనలో టీడీపీ
టీడీపీ మ‌హానాడుకు ప్ర‌జ‌ల నుంచి ఊహించ‌ని రీతిలో స్పంద‌న రావ‌డం, బాదుడే బాదుడు కార్య‌క్ర‌మానికి రాయ‌ల‌సీమ‌లో చంద్ర‌బాబుకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉర‌క‌లేస్తున్నాయి. అందుకే పొత్తులపై ఆ పార్టీ పునరాలోచనలో పడింది. ఇప్పుడే స్పందిస్తే గణనీయమైన సీట్లు పొగొట్టుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోంది. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఉత్త‌రాంధ్ర‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో ఇరుపార్టీల‌కు చెందిన ద్వితీయ‌శ్రేణి నాయ‌కుల మ‌ధ్య స‌వాళ్లు కొన‌సాగుతున్నాయి. ప్ర‌జ‌లు తెలుగుదేశం పార్టీవైపు ఉన్నార‌ని, వారు టీడీపీని గెలిపించాల‌నే ఉద్దేశంతో ఉన్న‌ట్లు పై రెండు కార్య‌క్ర‌మాలు స్ప‌ష్టం చేశాయ‌ని, క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌కు బ‌లం లేక‌పోవ‌డంతో తెలుగుదేశం నాయ‌క‌త్వం కింద వెళ‌దామ‌ని అంటున్నారు. వీటిని జ‌న‌సేన నాయ‌కులు ఖండిస్తున్నారు. త‌మ ఓటుబ్యాంకు ద్వారానే ఈసారి తెలుగుదేశంపార్టీకి విజ‌యం ద‌క్క‌బోతుంద‌నే విష‌యాన్ని గుర్తుచేస్తున్నారు.

ఎడముఖం.. పెడముఖం
నిన్న మొన్న‌టివ‌ర‌కు స‌ఖ్య‌త‌గానే ఉన్న తెలుగుదేశం, జ‌న‌సేన సైనికులు తాజాగా ప‌వ‌న్ వ్యాఖ్య‌లతో ఒక‌రిపై ఒక‌రు కామెంట్లు చేసుకుంటున్నారు. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా అధినాయ‌క‌త్వంతో సంబంధం లేకుండా ఇరు పార్టీల నాయ‌కులు అంత‌ర్గ‌తంగా పొత్తుపెట్టుకొని కొన్నిచోట్ల విజ‌యాలు కూడా కైవ‌సం చేసుకున్నారు. ఇప్పుడు మాత్రం చంద్ర‌బాబుకు మ‌రోసారి అవ‌కాశం ఇవ్వాల‌ని, రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ప‌య‌నిస్తుంద‌ని టీడీపీ వారు అంటుండ‌గా, ఈసారి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని జ‌నసైనికులు డిమాండ్ చేస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular