Pakistan Terror Operations: పాకిస్తాన్లో భారత దేశంలో ఉగ్రవాదాన్ని పెంచేవారు, ఆపరేట్ చేసేవారు, శిక్షణ ఇచ్చేవారు ఒక్కొక్కరుగా పైకి పోతున్నారు. కొందరు యాక్సిడెంట్లలో చనిపోయారు. కొందరు అగంతకుల కాల్పుల్లో చనిపోయారు. కొందరు పాత కక్షల కారణంగా హత్యకు గురయ్యారు. కొందరు మార్కెట్కు వెళ్లి హతమయ్యారు. లష్కర్, జైష్ సంస్థలకు చెందిన సుమారు 60 నుంచి 70 మంది గడిచిన నాలుగేళ్లలో హతమయ్యారు. తాజాగా కాసిమ్ గుజ్జర్ పెషావర్లో చనిపోయాడు. ఇతను భారత్లోని జమ్మూ ప్రాంతంలోని రియాసీకి చెందినవాడు. ఉగ్రవాదలో చేరి పాకిస్తాన్లో ఉంటున్నాడు. పీవోకేలో ఉంటూ అనేక కార్యకలాపాలు చేస్తున్నాడు. ఇతనికి సల్మాన్, సులేమాన్ అనే మారు పేర్లు కూడా ఉన్నాయి.
Also Read: వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాజీ ప్రేయసి.. రీ యూనియన్ అదిరిపోయింది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత కీలక పాత్ర..
జమ్మూలోని రియాసీకి చెందిన కాసిమ్ గుజ్జర్ ఉగ్రవాదంలో చేరి పాకిస్తాన్లో స్థిరపడ్డాడు. పీవోకేలో ఉంటూ భారత్లోకి ఉగ్రవాదులను పంపించే బాధ్యతలు నిర్వహించాడు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కొత్త ఉగ్ర స్థావరం ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించబడింది. కానీ అతడు కనుమరుగై, తాజాగా పెషావర్లో హత్యకు గురయ్యాడు.
అంతర్గత కక్షలే కారణమా?
రంజాన్ పండుగ రోజున లష్కర్ సీనియర్ కమాండర్ బిలాల్ ఆరిఫ్ సలాఫీని మర్కజ్–ఎ–తోయిబా మసీదులోనే అతని సహచరుడు ఒబెదుల్లా ఖాన్ కాల్చి చంపాడు. ఒబెదుల్లా భార్య కత్తితో పొడిచింది. ఇది ప్రతీకార చర్య. ఒబెదుల్లా అల్లుడిని బిలాల్ చంపించడంతో ఈ హత్య జరిగింది. మరో సీనియర్ నాయకుడు అబ్దుల్ రఫార్ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. ఇలాంటి ఘటనలు పాకిస్తాన్లో సాధారణం అయ్యాయి.
హత్యల వెనుక వ్యూహాలు..
ఉగ్ర సంస్థల్లో అధికార పోరు, డబ్బు వివాదాలు, వ్యక్తిగత ప్రతీకారాలు హత్యలకు దారితీస్తున్నాయి. పాకిస్తాన్ తన ఏజెంట్ల ద్వారా సొంత ఉగ్రవాదులనే ఏరివేస్తోందన్న వాదన బలంగా ఉంది. ప్రపంచం ముందు ‘ఉగ్రవాద బాధితులం‘ అని చెప్పుకునే పాకిస్తాన్, నిజానికి తేలుకుట్టిన దొంగలా వ్యవహరిస్తోంది. గత మూడేళ్లలో 20 మంది వరకు ఉగ్రవాదుల హత్యల వెనుక భారత నిఘా సంస్థల హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ధోరణి మరింత తీవ్రమైంది.
పాకిస్తాన్ భద్రతా వ్యవస్థ మౌనం: ఎందుకు?
ఈ హత్యలపై పాకిస్తాన్ ప్రభుత్వం, భద్రతా దళాలు అధికారికంగా కేసులు నమోదు చేయడం లేదు. దర్యాప్తు జరపడం లేదు. ఇది ఉగ్రవాదులు ఇప్పుడు సొంత దేశంలోనే మారువేషాల్లో ఉండేలా చేసింది. అగంతకులు దురంధర ఆపరేషన్లు చేస్తుండటంతో ఉగ్రవాదులు భయంతో వణుకుతున్నారు.
ఉగ్రవాద వ్యవస్థ కూలిపోతుందా?
ఉగ్రవాదుల మధ్య నమ్మకం లేకపోవడంతో ఒకరినొకరు చంపుకునే పరిస్థితి ఏర్పడింది. తాము పెంచిన ఉగ్రవాదులనే పాకిస్తాన్ ఇప్పుడు ఏరివేస్తోంది. ఇది ఉగ్రవాద వ్యవస్థకు పెద్ద దెబ్బ. ఆపరేషన్ సిందూర్ వంటి దాడులు ఉగ్రవాదులను అస్తవ్యస్తం చేశాయి. పాకిస్తాన్పై ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం లేదని నిరూపించుకోవడానికి ఈ హత్యలు చేయిస్తుందన్న అనుమానం ఉంది.
పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి, ఆపరేట్ చేసి, ఇప్పుడు సొంతంగానే ఏరివేస్తోంది. ఇది ‘తేలుకుట్టిన దొంగ‘ లాంటి వ్యవహారం. ఉగ్రవాదులు సొంత గూటిలోనే చితికిపోతున్నారు. కాసిమ్ గుజ్జర్, బిలాల్ ఆరిఫ్, అబ్దుల్ రఫార్ లాంటి వారి మరణాలు ఇందుకు నిదర్శనాలు. భవిష్యత్తులో ఈ ధోరణి కొనసాగితే లష్కర్, జైష్ లాంటి సంస్థలు పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది.